గువహటి: అస్సాం ఫేమస్ సింగర్ జుబీన్ గార్గ్ (52) మృతిపై రాష్ట్రీ సీఎం హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. జుబీన్ గార్గ్ ప్రమాదంలో చనిపోలేదని.. హత్యకు గురయ్యాడని తెలిపారు. జుబీన్ గార్గ్ మరణంపై చర్చించడానికి ప్రతిపక్షాలు అస్సాం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానంపై హిమంత బిశ్వశర్మ మాట్లాడారు.
“జుబీన్ గార్గ్ ప్రమాదంలో మరణించలేదని, హత్యకు గురయ్యాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. హత్యకేసులో భాగంగా నలుగురైదుగురు నిందితులపై పోలీసులు కేసును నమోదు చేశారు. నిందితుల్లో ఒకరు జుబీన్ గార్గ్ను చంపారు. మిగిలినవారు సహకరించారు. జుబీన్ గార్గ్ మృతిపై ఏర్పాటైన సిట్ త్వరలోనే చార్జ్ షీట్ దాఖలు చేస్తుంది.
నేరం వెనక ఉన్న ఉద్దేశం ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. డిసెంబర్లో చార్జ్షీట్ సమర్పించిన తర్వాత ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడిస్తారు” అని పేర్కొన్నారు.
