హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీని ప్లాస్టిక్ ఫ్రీ జోన్గా మారుస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీ ఆవరణలో ఇకపై ప్లాస్టిక్తో తయారైన వస్తువులేవీ వాడబోమని తేల్చి చెప్పారు. పర్యావరణం, వన్యప్రాణుల సంరక్షణపై ఏర్పాటు చేసిన అసెంబ్లీ కమిటీ సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్లో తొలిసారి సమావేశమైంది. హరిత తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని స్పీకర్ సూచించారు. మనిషి బతికేందుకు స్వచ్ఛమైన గాలి, ఫ్లోరైడ్ లేని నీళ్లు, మంచి ఆహారం అవసరమన్నారు. హరితహారం, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. అడవుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై పీసీసీఎఫ్, ఫారెస్ట్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. స్పీకర్, సభ్యులు అడిగిన డౌట్లను తీర్చారు.
అక్కడ వర్షాలెందుకు పడలేదు?
ఈ ఏడాది వర్షాలు బాగానే పడినా, మంజీరా నది పరీవాహక ప్రాంతంలో సరిగా కురవలేదని, దానికి గల కారణాలను విశ్లేషించాలని అధికారులను స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. రిజర్వ్ ఫారెస్ట్లో కంపా నిధులతో నీటి కుంటలు పెద్ద సంఖ్యలో తవ్వాలని సూచించారు. నాటిన మొక్కల్లో ఎక్కువ శాతం బతికేలా చర్యలు తీసుకోవాలన్నారు. ములుగు రిజర్వ్ ఫారెస్టులాగే రాష్ట్రం మొత్తం అటవీ పునరుజ్జీవ చర్యలు చేపట్టాలని, పోచారం రిజర్వ్ ఫారెస్టులో పచ్చదనాన్ని మరింతగా పెంచాలని సభ్యులు సూచించారు. పరిశ్రమలున్న ప్రాంతాల్లో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటు చేయాలన్నారు. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో జింకలు, నెమళ్ల సంఖ్య బాగా పెరిగిందని, వాటి వల్ల పంటకు నష్టం కలుగుతోందని, వాటి తరలింపుపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.