
ముగిసిన శాసనసభ సమావేశాలు
హైదరాబాద్, వెలుగు: రెండు రోజులపాటు సాగిన శాసనసభ సమావేశాలు శుక్రవారం ముగిశాయి. ప్రభుత్వం ఐదు బిల్లులను ప్రవేశపెట్టగా అసెంబ్లీ అన్నింటికీ ఆమోదముద్ర వేసింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న కొత్త మున్సిపల్ చట్టంపై సమగ్రంగా చర్చించింది. ఈ బిల్లుపై చర్చను ప్రారంభించిన సీఎం కేసీఆర్.. 1.15 గంటలపాటు మాట్లాడారు. తర్వాత మజ్లిస్ సభ్యుడు జాఫర్ హుస్సేన్, కాంగ్రెస్ శాసనసభ పక్షనేత మల్లు భట్టి విక్రమార్క, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ మాట్లాడారు. సభ్యులు ఐదు సవరణలు ప్రతిపాదించగా వాటిని పరిగణనలోకి తీసుకున్నారు. కలెక్టర్లకు అధికారం ఇవ్వడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టగా, ప్రభుత్వం దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. మొత్తంగా అసెంబ్లీ 4.44 గంటలపాటు సాగగా 16 మంది సభ్యులు మాట్లాడారు. తెలంగాణ మున్సిపల్ యాక్ట్, మున్సిపల్ నిబంధనల సవరణ బిల్లు, రుణ విమోచన కమిషన్ బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, మెడికల్ కాలేజీలు,
టీచింగ్ హాస్పిటళ్లలో ప్రొఫెసర్ల వయో పరిమితి పెంపు బిల్లులను ఆమోదించింది. తర్వాత సభను స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి నిరవధికంగా వాయిదా వేశారు.
మండలి 3.30 గంటలు
శాసనమండలి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ అధ్యక్షతన సమావేశమైంది. 3.30 గంటలపాటు కౌన్సిల్ జరగ్గా, 25 మంది సభ్యులు మాట్లాడారు. శాసనసభ ఆమోదించిన ఐదు బిల్లులకు మండలి ఆమోదం తెలిపింది. తర్వాత మండలిని డిప్యూటీ చైర్మన్ నిరవధికంగా వాయిదా వేశారు. అసెంబ్లీ, మండలి సమావేశాల షెడ్యూల్లో చేర్చినా సర్వశిక్ష అభియాన్ ఆడిట్ రిపోర్ట్, బేవరేజెస్ కార్పొరేషన్ వార్షిక నివేదికను సభలో ప్రవేశపెట్టలేదు. వీటిని బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశముంది.