
ఎత్తైన భవనాలకు రంగులు వేయడం, వాటి అద్దాలను క్లీన్ చేయడం చాలా రిస్క్తో కూడిన పని. అందుకోసం కార్మికులు ఎంతో కష్టపడాల్సి వస్తుంది. కానీ.. అలాంటి పనులను సులభంగా పూర్తి చేసేందుకు చెన్నైకి చెందిన ముగ్గురు ఫ్రెండ్స్ ఒక ఏఐ రోబోని తీసుకురాబోతున్నారు. అది బిల్డింగ్లకు రంగులు వేయడమే కాదు.. మనిషి సాయం లేకుండా అద్దాలను శుభ్రం చేస్తుంది.
దినేష్ (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్), వేల్మురుగన్ (చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్), కేశవరాజ్ (చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్) కలిసి ‘వివిడోబాట్స్’ అనే స్టార్టప్ పెట్టి, ఏఐ రోబోని తయారుచేస్తున్నారు. వీళ్లు ముగ్గురు చదువుకునే రోజుల నుంచి ఫ్రెండ్స్. ఒకే కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. దినేష్ ఈ రంగంలోకి రావడానికి గల కారణాన్ని వివరిస్తూ.. ‘‘మా కాలేజీ రోజుల్లో ఒక పెయింటర్ బిల్డింగ్కి రంగు వేస్తూ మొదటి అంతస్తు నుండి పడిపోయాడు.
అప్పుడే ఇలాంటి పనులను సులభంగా చేసేందుకు ఏదైనా కొత్త మార్గాన్ని కనిపెట్టాలని నిర్ణయించుకున్నాం. ఆ ఆలోచనతోనే స్టార్టప్ పెట్టాం. ప్రస్తుతం నమూనాని తయారుచేశాం. త్వరలోనే రోబోని అందుబాటులోకి తీసుకొస్తాం. ముఖ్యంగా నిర్మాణ రంగాన్ని లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్నాం. మా రోబోలు ఖర్చు, నిర్మాణ సమయం తగ్గిస్తాయి” అన్నారు. ప్రస్తుతం ఈ స్టార్టప్ చెన్నై కేంద్రంగా పనిచేస్తోంది. ఈ రోబోలు అందుబాటులోకి వస్తే.. 70 శాతం టైం, 50 శాతం ఖర్చు, 15 శాతం మెటీరియల్ వేస్టేజీ తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.