
- డీమార్ట్ లాభంలో భారీ పతనం.. 23 శాతం తగ్గి రూ.550.79 కోట్లకు..
- రూ.14,896.91 కోట్లకు రెవెన్యూ..7 శాతం డౌన్
న్యూఢిల్లీ: డీమార్ట్ సూపర్ మార్కెట్లను నిర్వహించే అవెన్యూ సూపర్మార్ట్స్ లిమిటెడ్ ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్(క్యూ4) లో రూ.550.79 కోట్ల నికర లాభాన్ని సాధించింది. కానీ, కిందటేడాది మార్చి క్వార్టర్లో వచ్చిన రూ.719.28 కోట్లతో పోలిస్తే మాత్రం ప్రాఫిట్ 23.4 శాతం పడిపోయింది. ఖర్చులు పెరగడమే ఇందుకు కారణం. కంపెనీ మొత్తం ఖర్చులు క్యూ4లో ఏడాది లెక్కన 18.2 శాతం పెరిగి రూ.14,176.61 కోట్లకు చేరుకున్నాయి.
అవెన్యూ సూపర్మార్ట్స్ మొత్తం ఆదాయం 7 శాతం పడిపోయి రూ.14,896.91 కోట్లకు తగ్గింది. కంపెనీ ఇబిటా (వడ్డీ, పన్నులకు ముందు ప్రాఫిట్) క్యూ4లో రూ.944 కోట్లుగా ఉంది. ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్లో పోటీ పెరిగిందని, దీంతో మార్జిన్లపై ఒత్తిడి పెరిగిందని కంపెనీ సీఈఓ నెవిల్ నొరోన్హా పేర్కొన్నారు.
ఎంట్రీ -లెవల్ సిబ్బందికి అధిక వేతనాలు ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు. వేగవంతమైన చెక్అవుట్లు, క్వాలిటీ ప్రొడక్ట్లను పెంచడానికి ఇన్వెస్ట్ చేస్తున్నామని, క్యూ4లో మరిన్ని స్టోర్లను తెరిచామని, ఇవన్నీ ఖర్చులతో కూడుకున్నవని అన్నారు. మార్చి 2025 మధ్యలో సీఈఓ డిజిగ్నేట్గా చేరిన అన్షుల్ అసావా ప్రస్తుతం వ్యాపారాన్ని అర్థం చేసుకుంటున్నారని నొరోన్హా పేర్కొన్నారు. ఆయన రాబోయే 4-5 నెలల్లో కొత్త సీఈఓగా బాధ్యతలు తీసుకుంటారు. అవెన్యూ సూపర్మార్ట్స్ షేరు శుక్రవారం రూ. 3.35 శాతం తగ్గి రూ.4,059.20 ముగిసింది.