- కెరీర్లో 50వ సెంచరీ చేసిన రోహిత్ శర్మ
- 74 రన్స్తో రాణించిన కోహ్లీ
- మూడో వన్డేలో ఇండియా గ్రాండ్ విక్టరీ
- 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చిత్తు
సిడ్నీ: కెరీర్ చివరి దశలో ఉన్న హిట్మ్యాన్ రోహిత్ శర్మ (125 బాల్స్లో 13 ఫోర్లు, 3 సిక్స్లతో 121 నాటౌట్), కింగ్ విరాట్ కోహ్లీ (81 బాల్స్లో 7 ఫోర్లతో 74 నాటౌట్) ఎట్టకేలకు గాడిలో పడ్డారు. ఆసీస్ గడ్డపై తమ వింటేజ్ ఫామ్ను మళ్లీ ఫ్యాన్స్కు చూపెట్టారు. దాంతో శనివారం జరిగిన ఆఖరిదైన మూడో వన్డేలో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది.
ఫలితంగా మూడు మ్యాచ్ల సిరీస్ చేజారినా.. కంగారూల ఆధిక్యాన్ని 2–1కి తగ్గించారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆసీస్ 46.4 ఓవర్లలో 236 రన్స్కు ఆలౌటైంది. మ్యాట్ రెన్షా (56) టాప్ స్కోరర్. తర్వాత ఛేజింగ్లో ఇండియా 38.3 ఓవర్లలో 237/1 స్కోరు చేసి ఈజీగా నెగ్గింది. రోహిత్ శర్మకే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఇరుజట్ల మధ్య బుధవారం కాన్బెర్రాలో తొలి పోరు జరగనుంది.
ఆశలు పెంచిన రో–కో
2027 వన్డే వరల్డ్ కప్లో ఆడే ఆశలు దాదాపు గల్లంతయ్యే పరిస్థితుల్లో రో–కో మళ్లీ తమ పాత ఆటను చూపెట్టారు. టీమిండియాకు తమ విలువేంటో ఈ ఒక్క ఇన్నింగ్స్తో రుజువు చేసి వైట్వాష్ నుంచి తప్పించారు. ఆసీస్ గడ్డపై ఈ ఇద్దరికి ఇది చివరి టూరే అయినా గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడారు. స్టార్క్ బౌలింగ్లో రెండు సిల్కీ స్మూత్ డ్రైవ్స్ కొట్టిన హిట్మ్యాన్ జంపా బౌలింగ్లో భారీ సిక్సర్ సంధించాడు. కొద్దిసేపటికే అద్భుతమైన ఇన్సైడ్ అవుట్ సిక్స్తో చెలరేగాడు. రెండో ఎండ్లో మెల్లగా ఆడిన కెప్టెన్ శుభ్మన్ గిల్ (24) తొలి వికెట్కు 69 రన్స్ జోడించి 11వ ఓవర్లో వెనుదిరిగాడు.
ఈ దశలో వచ్చిన కింగ్ కోహ్లీ తన ముందున్న పజిల్ను జాగ్రత్తగా విప్పాడు. గత రెండు మ్యాచ్ల్లో డకౌట్ కావడంతో విపరీతమైన ఒత్తిడిలో ఉన్న అతను.. స్టార్క్ బౌలింగ్లోనే సింగిల్ తీసి ఓ చిన్న చిరునవ్వు నవ్వాడు. ఆ వెంటనే తన ట్రేడ్ మార్క్ స్ట్రయిట్ డ్రైవ్తో ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత ఏమాత్రం వెనుదిరిగి చూసుకోలేదు. 36 రన్స్ వద్ద ఎల్లిస్.. కోహ్లీ ప్యాడ్లను హిట్ చేసి డీఆర్ఎస్ తీసుకున్నా రీప్లేలో నాటౌట్గా తేలింది. ఇక 63 బాల్స్లో హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ మరింత వేగంగా ఆడాడు. తర్వాతి 50 రన్స్ను కేవలం 42 బాల్స్లోనే రాబట్టాడు.
రెండో ఎండ్లో అదే జోరును కంటిన్యూ చేసిన కోహ్లీ 56 బాల్స్లో ఫిఫ్టీ కొట్టి హిట్మ్యాన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఈ ఇద్దరి జోరుకు అడ్డుకట్ట వేయాలని ఆసీస్ బౌలర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ కాలేదు. చివరకు 105 బాల్స్లో 33వ వన్డే సెంచరీ అందుకున్న హిట్మ్యాన్.. కోహ్లీతో కలిసి రెండో వికెట్కు కేవలం 170 బాల్స్లో 168 రన్స్ జోడించి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
రాణా అదుర్స్..
ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆసీస్ను కట్టడి చేయడంలో టీమిండియా బౌలర్లందరూ సూపర్ సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా హెడ్ కోచ్ గంభీర్ వల్లే జట్టులో కొనసాగుతున్నాడన్న అపవాదును ఈ మ్యాచ్తో పేసర్ హర్షిత్ రాణా (4/39) తుడిచిపెట్టాడు. అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేసి కంగారూలను ముప్పు తిప్పలు పెట్టాడు.
ఓపెనర్లు మిచెల్ మార్ష్ (41), ట్రావిస్ హెడ్ (29) తొలి వికెట్కు 61 రన్స్ జోడించి శుభారంభాన్నిచ్చారు. కానీ 10వ ఓవర్లో ప్రసిధ్ కృష్ణ (1/52) హెడ్ను ఔట్ చేసి ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఇక్కడి నుంచి ఆసీస్ మంచి పార్ట్నర్షిప్స్ను నెలకొల్పడంలో ఫెయిలైంది. రెన్షా, అలెక్స్ క్యారీ మధ్య 54 రన్స్ జతయినా భారీ స్కోరుకు బాటలు వేయలేకపోయింది.
సుందర్ బౌలింగ్లో షార్ట్ (30) ఇచ్చిన క్యాచ్ను బ్యాక్వర్డ్ పాయింట్లో కోహ్లీ అందుకున్న తీరు మ్యాచ్కే హైలెట్. తర్వాత క్యారీ ఇచ్చిన క్యాచ్ను శ్రేయస్ రన్నింగ్లో అందుకోవడం కూడా సూపర్బ్. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (1/50), అక్షర్ పటేల్ (1/18), సుందర్ (2/44) రన్స్ కట్టడి చేయడంతో ఆసీస్ లైనప్ ఒత్తిడిలో పడింది. చివర్లో కూపర్ కనొలీ (23) ఫర్వాలేదనిపించినా..మిచెల్ ఓవెన్ (1), స్టార్క్ (2), ఎల్లిస్ (16), జంపా (2 నాటౌట్), హాజిల్వుడ్ (0) నిరాశపర్చడంతో ఆసీస్ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా: 46.4 ఓవర్లలో 236 ఆలౌట్ (రెన్షా 56, షార్ట్ 30, హర్షిత్ రాణా 4/39, సుందర్ 2/44).
ఇండియా: 38.3 ఓవర్లలో 237/1 (రోహిత్ 121*, కోహ్లీ 74*, హాజిల్వుడ్ 1/23).
1ఆస్ట్రేలియాలో అత్యధిక సెంచరీలు (6) చేసిన తొలి విదేశీ బ్యాటర్ రోహిత్. విరాట్ (5), సంగక్కర (5)ను అధిగమించాడు.
1ఇంటర్నేషనల్ కెరీర్లో రోహిత్ 50 సెంచరీలు చేశాడు. టెస్ట్ల్లో 12, వన్డేల్లో 33, టీ20ల్లో 5 ఉన్నాయి. ఈ క్రమంలో ప్రతి ఫార్మాట్లో ఐదు కంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఏకైక ప్లేయర్ రోహిత్.
1వన్డే, టీ20ల్లో అత్యధిక రన్స్ చేసిన తొలి ప్లేయర్గా నిలిచిన కోహ్లీ (18,437). సచిన్ (18,436) రికార్డును అధిగమించాడు.
1ఇంటర్నేషనల్ వన్డే క్రికెట్లో ఛేజింగ్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన సచిన్ (70) రికార్డును కోహ్లీ (70) సమం చేశాడు. అదే విధంగా ఆసీస్పై 50+ స్కోర్లు చేసిన బ్యాటర్గా సచిన్ (24) రికార్డును కోహ్లీ (24) సమం చేశాడు.
2 వన్డేల్లో అత్యధిక రన్స్ చేసిన రెండో ప్లేయర్గా కోహ్లీ (14,255) నిలిచాడు. సచిన్ (18,426) ముందుండగా, సంగక్కర (14,234) మూడో ప్లేస్లో ఉన్నాడు.
