న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. రెండు రాష్ట్రాల్లో వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు గురై 65 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర ప్రదేశ్లో పిడుగు పాటుకు మొత్తం 40 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా ప్రయాగ్ రాజ్లో 14 మంది ప్రాణాలు కోల్పోగా.. ఫిరోజాబాద్, కాన్పూర్లో పది మంది ప్రాణాలు కోల్పోయారు. కౌసాంబిలో నలుగురు చనిపోయారు. ఫిరోజాబాద్, ఉన్నవ్, రాయ్ బరేలి జిల్లాల్లో ఇద్దరి చోప్పున చనిపోయారు. జైపూర్లో 11 మంది మెరుపులతో సెల్ఫీ దిగే యత్నంలో ప్రాణాలు కోల్పోయారు. జైపూర్, అంబర్ కోటలోని వాచ్ ఫోర్ట్లో మెరుపులను తమ ఫోన్ కెమెరాల్లో బంధించాలని చూశారు. ఈ క్రమంలో సెల్ఫీ దిగాలని యత్నించారు. కానీ కొద్ది సేపటికే పిడుగుపాటుతో మృతి చెందారు.
రాజస్థాన్లోని జైపూర్, కోట, ఝలవాడ్, దోలాపూర్ లో పిడుగులు పడ్డాయి. రాజస్థాన్ లో మొత్తం ఏడుగురు చిన్నారులు సహా 25 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 21 మందికి గాయాలయ్యాయి. అమేర్ ఫోర్ట్ దగ్గర ఘటనలోనే 16 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరంతా వాచ్ టవర్ దగ్గర సెల్ఫీ తీసుకుంటుండగా పిడుగు పడింది. మరో 29 మందిని స్థానికుల సహాయంతో రక్షించి హాస్పిటల్ కు తరలించామన్నారు జైపూర్ సీపీ ఆనంద్ శ్రీవాస్తవ. రాజస్థాన్ పిడుగుపాటు ప్రమాదంపై సీఎం అశోక్ గెహ్లాట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రధాని మోడీ కూడా సంతాపం తెలిపారు.