ముంబై: పైలట్ సుమీత్కు కన్నీటి వీడ్కోలు..అంతిమ యాత్రలో కుటుంబ సభ్యులు, స్నేహితులు

ముంబై:  పైలట్ సుమీత్కు కన్నీటి వీడ్కోలు..అంతిమ యాత్రలో కుటుంబ సభ్యులు, స్నేహితులు
  • శవపేటికను చూడగానే బోరున విలపించిన తండ్రి
  • రాయ్​గఢ్​లో క్రూ మెంబర్ మైథిలీకి అంత్యక్రియలు

ముంబై: అహ్మదాబాద్​లో పోయిన వారం జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయిన పైలట్ సుమీత్ సబర్వాల్ అంత్యక్రియలు మంగళవారం ముంబైలో ముగిశాయి. డీఎన్ఏ శాంపిల్స్ మ్యాచ్ కావడంతో డెడ్​బాడీని డాక్టర్లు అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

అహ్మదాబాద్ నుంచి మృతదేహాన్ని ముంబై ఎయిర్​పోర్టుకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి సుమీత్ కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్న పొవాయి ఏరియాలోని జల్ వాయు విహార్ కు తరలించారు. ఫ్యామిలీ మెంబర్లు, స్నేహితులు, బంధువులు సబర్వాల్ ఇంటికి చేరుకుని నివాళులర్పించారు. 

శవపేటికను చూసిన వెంటనే సుమీత్ తండ్రి పుష్కరాజ్ కన్నీరుమున్నీరయ్యారు. 55 ఏండ్ల కెప్టెన్ సబర్వాల్.. అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని చూసుకునేందుకు ముందుగానే పదవీ విరమణ చేయాలని అనుకున్నారు. కానీ, అంతలోనే ఘోరం జరిగిపోయింది. 

సుమీత్​తో ఉన్న అనుబంధాన్ని అందరూ గుర్తు చేసుకున్నారు. అనంతరం డెడ్​బాడీని సబర్బన్ చాకాలలోని స్మశాన వాటికకు తరలించారు. సుమీత్ తండ్రి చేతులు మీదుగా అంత్యక్రియలు జరిగాయి. ప్రముఖ వ్యాపారవేత్త నిరంజన్ హీరానందాని, లోకల్ ఎమ్మెల్యే దిలీప్ లాండేతో పాటు పలువురు పొలిటికల్ లీడర్లు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. 

ఇదే విమాన ప్రమాదంలో చనిపోయిన క్రూ మెంబర్ మైథిలి పాటిల్ అంత్యక్రియలు మంగళవారం రాయ్​గఢ్ జిల్లా నవ్హా గ్రామంలో ముగిశాయి. మైథిలి అంత్యక్రియల్లో ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెండేండ్ల కిందే ఆమె క్రూ మెంబర్​గా ఎయిరిండియాలో జాయిన్ అయింది.

135 మంది డెడ్​బాడీలు గుర్తింపు

డీఎన్ఏ టెస్టుల ద్వారా మంగళవారం ఉదయం నాటికి 135 డీఎన్ఏ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని వైద్యులు తెలిపారు. వాటిలో 101 డెడ్​బాడీలను ఫ్యామిలీ మెంబర్లకు అప్పగించామని, వీటిలో ఐదు డెడ్​బాడీలు విమానంలోని ప్రయాణికులవి కావని చెప్పారు. మృతుల్లో ఎక్కువ మంది గుజరాత్, మహారాష్ట్ర, బిహార్, రాజస్థాన్, దియూకు చెందినవాళ్లుగా గుర్తించారు.