తెగిస్తే తానీషాలు.. భరిస్తే బానిసలు!

తెగిస్తే తానీషాలు.. భరిస్తే బానిసలు!

ఎమ్మెల్యే నరేందర్​ను బట్టలిప్పి చౌటుప్పల్​లో నిలబెడ్తం
నేతన్నల మగ్గాన్నే తన్నుతడా?
మునుగోడును దత్తత తీసుకోకుండా ఎనిమిదిన్నరేండ్లు ఏంచేశారని కేటీఆర్​పై ఫైర్ 

సంస్థాన్‌‌‌‌ నారాయణపురం, వెలుగు :  తానీషాలుగా మారి చక్రవర్తులు అవుతారో.. అన్ని భరిస్తూ బానిసలుగా బతుకుతారో ప్రజలే నిర్ణయించుకోవాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. టీఆర్ఎస్ లీడర్లు మోసగాళ్లు, ఘరానా దొంగలని విమర్శించారు. ఇచ్చిన హామీలు ​ అమలు చేయని టీఆర్​ఎస్.. సిగ్గు లేకుండా ఓట్లు అడుగుతున్నదని మండిపడ్డారు. శనివారం సంస్థాన్ నారాయణపురంలో ‘బహుజనుల ఆత్మగౌరవ సభ’ నిర్వహించారు. ఈ సందర్భంగా శివాలయం నుంచి సభా వేదిక దాకా భారీ ర్యాలీ నిర్వహించారు. తర్వాత సభలో ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. ‘‘మునుగోడును దత్తత తీసుకుంటానని కేటీఆర్ అంటున్నడు. ఎనిమిదిన్నరేండ్లు అధికారంలో ఉండి గడ్డి పీకినవా? మర్రిగూడలోని భూ నిర్వాసితులను హరీశ్​రావు ఆదుకుంటానంటున్నడు. నీ మామతో మర్రిగూడ వచ్చి ఇంటికి రెండు ఉద్యోగాలిస్తానన్న హామీ ఏమైంది..?”అని ప్రవీణ్​ కుమార్​ ప్రశ్నించారు. 

ఎగిరేది నీలి రంగు జెండానే..
మునుగోడు గడ్డపై ఎగిరేది నీలి రంగు జెండానేనని ​ ప్రవీణ్​ కుమార్​ అన్నారు. ‘‘బీఎస్పీ ర్యాలీ చూసి బీజేపోళ్లు పారిపోయిన్రు. జేపీ నడ్డా సభను వాయిదా వేసుకున్నరు. మన సభ టైంలో వైన్​ షాపుల వద్ద ఎవరూ లేరు. ఆదివారం మాత్రం క్యూ కడ్తరు. ఎందుకంటే మన కోతల రాయుడు కేసీఆర్ సభ చండూరులో ఉన్నది. అందుకే టీఆర్​ఎస్సోళ్లంతా వైన్ షాపుల దగ్గరే ఉంటరు”అని విమర్శించారు. ‘‘నేతన్నల మగ్గాన్ని ఎమ్మెల్యే నరేందర్ కాలుతో తన్నుతున్నడు. ఆడి బట్టలిప్పి చౌటుప్పల్​లో నిలబెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి”అని ​హెచ్చరించారు. -బీసీ బిడ్డ శంకరచారిని గెలిపించాలని కోరారు. 

ఓట్లు మావే.. సీట్లు మావే..
‘‘బీఎస్పీ వచ్చి మా ఓట్లు చీల్చుతున్నదని టీఆర్​ఎస్​ అంటున్నది. ఇక్కడి ఓట్లు మావే.. సీట్లు మావే.. అట్టల మీద గొల్ల కుర్మలకు అన్నం పెట్టి వారి ఆత్మ గౌరవాన్ని కించపర్చిన్రు. అలాంటి టీఆర్​ఎస్​కు గుణపాఠం చెప్పాలి”అని ప్రవీణ్​కుమార్​ అన్నారు. కారు డొక్కు అయ్యిందని, 20 ఏండ్ల కారును ఎవరైనా నడిపిస్తారా? అని టీఆర్​ఎస్​ను ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు. ఇక కారును యార్డ్​కు పంపాల్సిందే అని సెటైర్లు వేశారు. కమ్యూనిస్టులు దొరలకు మద్దతు ధరకు అమ్ముడుపోయారని ఎద్దేవా చేశారు. అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కును మందు, చికెన్, డబ్బులకు అమ్ముకోవద్దని రాజ్యసభ సభ్యులు రాంజీ గౌతమ్ సూచించారు.