ఐఎస్ఐ, లష్కరేతో అతీక్​కు లింక్​ .. టెర్రరిస్ట్​ల నుంచి ఆయుధాల కొనుగోలు

ఐఎస్ఐ, లష్కరేతో అతీక్​కు లింక్​ .. టెర్రరిస్ట్​ల నుంచి ఆయుధాల కొనుగోలు

ప్రయాగ్​రాజ్(యూపీ): ఉత్తరప్రదేశ్​లోని ప్రయాగ్​రాజ్​లో శనివారం రాత్రి టీవీ లైవ్​లో హత్యకు గురైన గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్​కు పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ), లష్కరే తాయిబా టెర్రరిస్ట్ సంస్థతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. టెర్రరిస్ట్ ల నుంచి తాను వెపన్స్ కొన్నానని విచారణలో ఇదివరకే అతీక్ అంగీకరించాడని ఎఫ్ఐఆర్​లో పేర్కొన్నారు. ‘‘ఐఎస్ఐ డ్రోన్ల ద్వారా వెపన్స్​ను పంజాబ్​లో జారవిడిచేది. ఆ వెపన్స్​ను కొందరు ఐఎస్ఐతో లింకులు ఉన్న వ్యక్తులు సేకరించి, లష్కరేకు, ఖలిస్తాన్  వేర్పాటువాద సంస్థలకు అందజేసేవారు. వారి నుంచి నేను పిస్టల్, ఏకే 47, ఆర్డీఎక్స్ కొనుగోలు చేసి డబ్బులు చెల్లించాను” అని అతీక్ స్టేట్ మెంట్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

ఆ వెపన్స్​తోనే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసు సాక్షి ఉమేశ్ పాల్ ను, ఇద్దరు పోలీసులను హత్య చేసినట్లు వెల్లడించాడన్నారు. ఐఎస్ఐ, లష్కరేకు చెందిన వ్యక్తులు తన వద్దకు కూడా వచ్చేవారని, వాళ్లు ఎక్కడున్నారో తెలుసని.. దేశంలో భారీ విధ్వంసానికి వారు కుట్ర చేసినట్లు కూడా చెప్పినట్లు వివరించారు. అయితే, యూపీ పోలీసుల కస్టడీలో ఉన్న తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ అతీక్ అహ్మద్ రెండు వారాల కిందటే సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా.. రిజెక్ట్ అయింది. రెండు వారాల్లోగా జైలులో నుంచి బయటకు తీసుకెళ్లి తమను చంపేస్తారంటూ ఓ పోలీస్ ఆఫీసర్ చెప్పాడని ఇటీవల అతీక్ మీడియాతో చెప్పిన వీడియో కూడా తాజాగా వైరల్ అయింది.     

విచారణకు జ్యుడీషియల్ కమిషన్   

అతీక్, అష్రఫ్ హత్యతో ప్రయాగ్ రాజ్ సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రయాగ్ రాజ్ లో పోలీసులు ఆదివారం భద్రతను కట్టుదిట్టం చేశారు. సిటీలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతోపాటు 144 సెక్షన్ విధించారు. అండర్ వరల్డ్ లో ఫేమస్ కావాలనే అతీక్, అతడి సోదరుడిని చంపామని నిందితులు లవ్లేశ్ తివారి (22), సన్నీ (23), అరుణ్ మౌర్య(18) విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ముగ్గురూ తమ కుటుంబాల నుంచి దూరంగా ఉంటూ క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తున్నారని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి17 మంది పోలీసులను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీనిపై విచారణకు ముగ్గురు సభ్యుల జ్యుడీషియల్ కమిషన్​ను నియమించింది.   

చట్టంతో ఆటలా?: ప్రతిపక్షాల మండిపాటు 
 
గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్, అతడి సోదరుడి హత్య నేపథ్యంలో యూపీ బీజేపీ సర్కారుపై కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ‘‘క్రిమినల్స్ కు చట్టం ప్రకారమే కఠిన శిక్షలు పడాలి. కానీ ఇలా చట్టంతో ఆటలు ఆడితే ఆటవిక రాజ్యానికి దారి తీస్తుంది. ఇది ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తుంది” అని ఆయన ఫైర్ అయ్యారు. క్రిమినల్స్ కు శిక్ష వేసే అధికారం న్యాయ వ్యవస్థకు మాత్రమే ఉందని, ప్రభుత్వాలు, నాయకులకు చట్టాన్ని ఉల్లంఘించే హక్కులేదన్నారు. సీపీఎం, టీఎంసీ, శివసేన (యూబీటీ), తదితర ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా ఈ ఘటనపై విమర్శలు చేశారు.  

అతీక్ ఓటే.. యూపీఏ సర్కార్​ను నిలబెట్టింది 

అమెరికాతో అణు ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ 2008లో ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్​పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టాయి. యూపీఏకు లోక్ సభలో 228 మంది ఎంపీలు ఉండగా, మరో 44 ఓట్లు అవసరం అయ్యాయి. దీంతో అప్పటి సమాజ్ వాదీ ఎంపీ అతీక్ తో సహా ఆరుగురు క్రిమినల్ ఎంపీలను యూపీఏ ప్రభుత్వం జైలు నుంచి రప్పించి, లోక్ సభలో ఓటింగ్​లో పాల్గొనేలా చూసింది. వీరితోపాటు ఇతర ఎస్పీ ఎంపీలు, ఆర్ఎల్డీ, జేడీఎస్ ఎంపీలు మద్దతుతో సర్కార్ నిలబడింది. కాగా, 18 ఏండ్లకే మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయిన అతీక్ పై100కుపైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి.1989లో రాజకీయాల్లోకి వచ్చిన అతడు. మూడు సార్లు ఇండిపెండెంట్​గా, ఒకసారి ఎస్పీ నుంచి మరోసారి అప్నాదళ్ నుంచి ఎమ్మెల్యేగా, 2004లో సమాజ్ వాదీ పార్టీ నుంచి ఎంపీగా గెలిచాడు. అతీక్, అష్రఫ్​ల మృతదేహాలను ఆదివారం యూపీలోని వారి పూర్వీకుల గ్రామంలో ఖననం చేశారు. గురువారం జరిగిన ఎన్ కౌంటర్​లో చనిపోయిన అతీక్ కొడుకు అసద్​ను కూడా ఇక్కడే పూడ్చిపెట్టారు.