నోటాకైనా వేయండి కానీ ఓటేయకుండా ఉండొద్దు

నోటాకైనా వేయండి కానీ ఓటేయకుండా ఉండొద్దు

సిటీలో అవేర్‌నెస్ కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థలు

వివిధ ఏరియాల్లో వలంటీర్ల క్యాంపెయిన్లు
ఓటు విలువ చెబుతూ స్లో‌గన్స్​తో ప్రోగ్రామ్‌లు

“సిటీలో గతుకుల రోడ్లతో పడుతున్న బాధలు. ట్రాఫిక్ తో నరకం చూస్తున్న రోజులు.. కంప్లయింట్​చేసినా స్పందించని అధికారులు.. ఇలాంటి ప్రాబ్లమ్స్​ పోవాలంటే నీ ఓటు ప్రశ్నిస్తుంది.. సమాధానం వచ్చేలా చేస్తుంది.. పరిష్కారం చూపుతుంది.. ” అంటూ స్లోగన్స్​తో ఓటుహక్కుపై స్వచ్ఛంద సంస్థలు అవేర్​నెస్​చేస్తున్నాయి. ఓటు హక్కును సిటిజన్స్​ మస్ట్​గా  వినియోగించుకోవాలని, మెరుగైన సమాజంగా తీర్చిదిద్దుకోవాలంటే ఓటే ఆయుధం అంటూ.. ప్ల కార్డులతో సిటీవ్యాప్తంగా  ఆయా సంస్థల వలంటీర్లు క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్, వెలుగు: సిటీలో ఎడ్యుకేటర్స్​​సంఖ్య ఎక్కువైనా ఓటింగ్ శాతం మాత్రం తక్కువగా నమోదవుతుంది. చాలామంది ఓటు హక్కును వినియోగించుకోరు. ఓటువేసేందుకు ఇంట్రస్ట్ చూపరు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఓటు ఎంత విలువైందో  తెలుపుతూ పలు స్వచ్ఛంద సంస్థల వలంటీర్లు అవేర్​నెస్​ కల్పిస్తున్నారు.  వారం రోజులుగా  క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నారు.  సిటీలో  యూత్ వలంటీర్లు తమ ఏరియాల్లో రోడ్లపై తిరుగుతూ జనాలకు ఓటుహక్కుపై వివరిస్తున్నారు.  చెక్ పోస్ట్ లు, మెయిన్ సెంటర్లు, సిగ్నల్స్  వద్ద ప్ల కార్డులు పట్టుకుని నిల్చుంటున్నారు. ఓటును అమ్ముకోవద్దని, అవినీతిపరులకు వేయమని ఓటర్లతో ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. ఒక్కో ఏరియాలో 20 నుంచి 30మంది వలంటీర్లు క్యాంపెయిన్​ చేస్తున్నారు. నగరానికి చెందిన యునైట్ టు సర్వ్, యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆర్గనైజేషన్, లిట్ బై హ్యుమానిటీ వంటి  తదితర సంస్థలు   ప్రోగ్రామ్స్ చేస్తున్నాయి.

నోటాకైనా వేయమని..

ప్రాబ్లమ్స్ పై ​స్పందించని, పట్టించుకోని నాయకులకు ఓటేయమని వరద బాధితులు బాహాటంగానే తేల్చి చెప్తున్నారని పలువురు వలంటీర్లు పేర్కొన్నారు. మెరుగైన సమాజం కోసం, నిజాయితీ కలిగిన నాయకులను ఎన్నుకునే అవకాశం కూడా ఇదేనని అవగాహన కల్పిస్తున్నారు. ఎవరికి ఓటేయడం, ఇష్టం లేకుంటే కనీసం నోటాకైనా వేసి బాధ్యత వినియోగించుకోమని కోరుతున్నారు. డబ్బులు తీసుకుని ఓటు వేయొద్దని, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలవాలని సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం ఓటు వేయాలని తెలుపుతూ పోస్ట్ లు పెడుతున్నామంటున్నారు.

ఓటును అమ్ముకోవద్దని..

ఏ ఎన్నికలైనా సిటీలో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతుంది. సమస్యలపై నాయకులను నిలదీయాలంటే ఓటర్లు ఓటు హక్కును కచ్చితంగా వినియోగించుకోవాలి. ఓటుహక్కుపై అవేర్​నెస్​ కల్పించేందుకు వారం రోజులుగా క్యాంపెయిన్ లు చేస్తున్నాం. 50 మంది వలంటీర్లం ఓటుపై వివరించి చెప్తున్నాం.  నోటుకు ఓటును అమ్ముకోవద్దని సూచిస్తున్నాం. వారితో స్లోగన్స్ చెప్పిస్తున్నాం.  ప్రజల నుంచి రెస్పాన్స్ బాగుంది.

– రాజేంద్ర, ఫౌండర్, యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆర్గనైజేషన్

యూత్ నుంచే ఎక్కువ రెస్పాన్స్

యూతే ఎక్కువగా ఒపీనియన్స్ షేర్ చేసుకుంటూ వాటినే సోషల్ మీడియాలో పోస్ట్ లుగా పెడుతున్నారు.  ఓటింగ్ రోజు హాలీడే అని ఎంజాయ్ చేయకుండా ఓటేస్తామని చెబుతున్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగమంటున్నారు. వారి నుంచే ఎక్కువగా రెస్పాన్స్​ వస్తుంది.

– జయరాం, వలంటీర్