ఈ మధ్య కాలంలో ఏటీఎం చోరీలు చాలా కామన్ అయిపోయాయి. దొంగలు యథేచ్చగా ఏటీఎం చోరీలకు పాల్పడుతున్నారు. కొత్త కొత్త క్రిమినల్ ఐడియాలతో దోపిడీ చేస్తున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ప్రభుత్వ బ్యాంకు ఏటీఎం ను గ్యాస్ కట్టర్లతో కట్ చేసి భారీ మొత్తం లో క్యాష్ ఎత్తుకెళ్లారు. ఎంత పకడ్బందీగా చేశారంటే.. సర్వీస్ సిబ్బంది వచ్చి గుర్తించే వరకు ఏటీఎం చోరీ జరిగినట్లు ఎవరూ గుర్తించలేకపోయారు. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ లోని మందసౌర్ జిల్లాలో ఆగస్టు 30 అర్థరాత్రి భాన్ పురా అనే ప్రాంతంలో ఓ ప్రభుత్వ బ్యాంకు ఏటీఎంను దొంగలు కొల్లగొట్టారు.ఏటీఎం పగలగొట్టి రూ. 6.5 లక్షలు క్యాష్ ఎత్తుకెళ్లారు. విచిత్రం ఏమిటంటే.. చోరీ జరిగినట్లు గుర్తించే ఆనవాళ్లు లేకుండా దొంగల తమ పని దర్జాగా చేసుకొనివెళ్లారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. నలుగురు దొంగలు ఏటీఎం చోరీకి పాల్పడ్డారు. మొదట ఏటీఎం సెంటర్ షట్టర తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. తర్వాత గ్యాస్ కట్టర్లతో ఏటీఎం యంత్రాన్ని కట్ చేశారు. ఏటీఎంలో ఉన్న రూ. 6.5లక్షల క్యాష్ ను దోచుకెళ్లారు.
చోరీ తర్వాత అక్కడి నుంచి పారిపోయేక్రమంలో అక్కడ ఎటువంటి ఆనవాళ్లు లేకుండా దొంగలు జాగ్రత్తపడ్డారు. ఏటీఎం సెంటర్ షట్టర్ ను యథావిదిగా కిందకు దించి వెళ్లిపోయారు.
సర్వీసింగ్ కోసం కంపెనీ బృందం వచ్చి చూడగా చోరీ విషయం బయటపడింది. ఏటీఎం యంత్రం దెబ్బతినడంతో చోరీ కి గురైనట్లు గుర్తించారు. అప్పటివరకు బ్యాంకు అధికారులకు దొంగతనం విషయం తెలియకపోవడం గమనార్హం. ఈ ఘటన స్థానికంగా భద్రతా ఏర్పాట్లపై అనేక ప్రశ్నలు లేవనెత్తింది.
ALSO READ : హైదరాబాద్ సిటీలో మరో రోడ్డు ప్రమాదం
ఇక దొంగలను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు గట్టిగానే గాలింపు చర్యలు చేపట్టారు. ఏటీఎం పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలించి నలుగురు దొంగల ఆనవాళ్లు గుర్తించారు. వారి పట్టుకునే పనిలో పడ్డారు. దర్యాప్తు కొనసాగుతోంది.
