
హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రిక్ టూవీలర్ల తయారీ కంపెనీ ఆటుమొబైల్ ఆటమ్ వేడర్ బైక్ను తన మొదటి మహిళా కస్టమర్కు శనివారం డెలివరీ చేసింది. సికింద్రాబాద్లోని ఆటమ్ లైఫ్ షోరూమ్లో నజారీ మనీషాకు ఈ బండి తాళాలను అందజేసింది. మనీషా ఒక ఆర్కిటెక్ట్ . ఇది ఆమెకు మొదటి బైక్. మనీషా తనకు ఏదో ఒక "స్కూటర్ లేదా మోటార్ సైకిల్ లాగా కాకుండా ప్రత్యేకమైనది’’ కావాలని కోరుకున్నారని, అందుకే ఆటమ్ వేడర్ని ఎంచుకున్నారని ఆటుమొబైల్ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. సింగిల్ -సీటర్ ఈవీ బైక్ కేటగిరీలో దేశవ్యాప్తంగా రెండు వేలకు పైగా బండ్లను కంపెనీ అమ్మింది. ఆటమ్ వేడర్లో విశాలమైన బూట్ స్పేస్, గ్యాస్ -ఛార్జ్డ్ సస్పెన్షన్, వెడల్పాటి టైర్లు వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.
ఇవి రైడర్లను ఆకర్షిస్తున్నాయి. ఇప్పటి వరకు 20 వేలకు పైగా కస్టమర్లు ఆటమ్ వేడర్ను టెస్ట్ రైడ్ చేశారని ఆటుమొబైల్ పేర్కొంది. ఈ బండిలో 2.4 కిలో వాట్ల బ్యాటరీ ప్యాక్ అమర్చారు. టాప్ స్పీడ్ గంటకు 65 కి.మీ. గేర్లెస్ డిజైన్ (క్లచ్ లేదు), లెగ్ బ్రేక్ లేకపోవడం వంటివి ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఈ బైక్ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కి.మీ వరకు ప్రయాణించొచ్చు. 90 శాతం పార్ట్లను ఇండియాలోనే సేకరించి ఆటమ్ వేడర్ను తయారు చేస్తున్నామని ఆటుమొబైల్ పేర్కొంది. ఇది ఇండియన్ రోడ్ల కోసం ఇండియాలో తయారు చేసిన బైక్ అని వెల్లడించింది. కాగా, విశాక ఇండస్ట్రీస్ జాయింట్ ఎండీ గడ్డం వంశీ కృష్ణ ఆటుమొబైల్ను స్థాపించారు.