- దిశ మీటింగ్లో ఎన్హెచ్ అధికారుల గైర్హాజరుపై ఆగ్రహం
మహబూబాబాద్, వెలుగు: దిశ మీటింగ్కు నేషనల్ హైవే ఉన్నతాధికారులు హాజరుకాకపోవడంపై దిశ కమిటీ చైర్మన్, ఎంపీ పోరిక బలరామ్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కలెక్టర్ స్నేహ శబరీష్ అధ్యక్షతన జరిగిన దిశ కమిటీ సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి ఫారెస్ట్ క్లియరెన్స్లో సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న అంతర్గత పట్టణ అభివృద్ధి పనులను వేగం పెంచాలని సూచించారు. జిల్లాలో యూరియా కొరత లేకుండా, బుకింగ్ ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ప్రతీ కేంద్రం వద్ద ఒక వలంటీర్ ను నియమించాలన్నారు. సాయిల్ హెల్త్ కార్డులను పంపిణీ చేయాలని, రైతులకు పంట మార్పిడి విధానంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. గూడురు మండలం అప్పిరాజుపల్లి సమీపంలో ఫారెస్ట్ క్లియరెన్స్లేక నిలిచిపోయిన పనులను పూర్తి చేసేందుకు చర్యలను చేపడుతామన్నారు.
ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్ మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కొత్త చట్టం ప్రకారం జిల్లాలో పథకాల పనులను అమలు చేయాలని, ఇరిగేషన్ పెండింగ్, మైనర్ రిపేర్లను త్వరగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ కె.అనిల్ కుమార్, హౌసింగ్ పీడీ పురుషోత్తం, డీఆర్డీవో పీడీ మధుసూదన రాజు, దిశ కమిటీ సభ్యులు లాలునాయక్, కిషన్ రాజపుత్, బాబురావు, ఎం.గీతారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్లు గుగులోతు జ్యోతి(మహ–బాద్), రాజకుమారి(డోర్నకల్), బానోతు సునీత(కేసముద్రం), ప్రగతిరెడ్డి(మరిపెడ), తదితరులు పాల్గొన్నారు.
