కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ప్రక్రియలో భాగంగా కీలక ముందడుగు పడింది. హన్మకొండ వడ్డెపల్లి ఫిల్టర్ బెడ్స్ పరిసర ప్రాంతాల్లోని భూములను అభివృద్ధి చేసేందుకు భూ యజమానులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన్నట్లు కుడా చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి తెలిపారు.
మంగళవారం వడ్డెపల్లి ఫిల్టర్ బెడ్స్ భూ యజమానుల కమిటీ సభ్యులు బూర విద్యాసాగర్, ఎం.విజయ్ కుమార్, డి. స్వరాజ్యలక్ష్మి, బూర అశోక్ కుమార్, బల్లెం వెంకటయ్య, రాజేశ్, తిరుపతి రెడ్డి కుడా ఆఫీస్లో చైర్మన్ వెంకట్రామ్ రెడ్డిని, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ అజిత్ రెడ్డిని కలిసి సుమారు 30 ఎకరాల విలువైన భూమిని ఎల్పీఎస్ నిబంధనల ప్రకారం కుడా ఆధ్వర్యంలో లేఅవుట్ చేయడానికి అంగీకారం తెలిపారు. ఇందుకు సంబంధించిన అధికారిక అప్లికేషన్లు, భూమి హక్కుల పత్రాలను అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అధికారికంగా సమర్పించారు.
