హైదరాబాద్, వెలుగు: ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటనను సీబీఐతో దర్యాప్తు చేయించాలని దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విచారణపై నమ్మకం లేదని స్పష్టం చేశారు. ప్రభాకర్ రెడ్డిపై దాడిని ఖండిస్తున్నామన్నారు. అయితే, ఆ దాడి చేసింది కాంగ్రెస్ కార్యకర్త అని అనడం కరెక్ట్ కాదని, 2018, 2019 నాటి పాత ఫొటోలను చూపించి తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దాడి చేయించింది కాంగ్రెసేనంటూ ఘటన జరిగిన గంటలోనే సీఎం కేసీఆర్ అనడం ఏంటని ఫైర్ అయ్యారు. నిందితుడి కాల్ డేటాను వెరిఫై చేస్తున్నట్టు సిద్దిపేట ఎస్పీ చెప్తున్నారని, అయినా ముందుగానే కేసీఆర్ తప్పుడు ప్రకటన చేశారని మండిపడ్డారు.
మంగళవారం ఆయన పీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డితో కలిసి గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. దాడిని బీఆర్ఎస్ లీడర్లు సానుభూతి కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. ప్రభాకర్ రెడ్డిని దగ్గర్లోని కార్పొరేట్ ఆస్పత్రికి కాకుండా బీఆర్ఎస్కు అనుకూల యశోద ఆస్పత్రికి తీసుకెళ్లడం అనుమానాలకు తావిస్తున్నదన్నారు. కోడ్ అమలులో ఉన్నప్పుడు సిద్దిపేటలో ఎట్లా బంద్ నిర్వహిస్తారని ప్రశ్నించారు. ప్రభాకర్ రెడ్డిపై దాడి కాంగ్రెస్ పనేనంటూ కేసీఆర్ బట్ట కాల్చి మీద వేస్తున్నారని రామ్మోహన్ రెడ్డి విమర్శించారు.