పక్కా ప్లాన్ తో దాడులు చేశారు : కిషన్ రెడ్డి

పక్కా ప్లాన్ తో దాడులు చేశారు : కిషన్ రెడ్డి

గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పైన కక్ష సాధింపు జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. సెల్ ఫోన్ ట్యాప్ చేయడంతో పాటు కుట్రలు జరుగుతున్నాయన్నారు. పలిమెల గ్రామంలో ఈటల కాన్వాయ్ పై జరిగిన దాడిని ఆయన ఖండించారు. బీజేపీ గెలుపు కోసం పనిచేస్తున్న ఈటలపై కుట్ర జరుగుతోందని, ఈటల మొహం చూడొద్దని అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్నారన్నారు. అసెంబ్లీ లో శాసనసభ్యులను సివిల్ పోలీసులు అరెస్ట్ చేయడం చరిత్రలో లేదన్నారు. పలివెల గ్రామంలో ఎన్నికల ప్రచారం చేస్తుంటే దాడులకు దిగారని, పక్కా ప్లాన్ తో ఇలా చేశారన్నారు. పోలీసులు వద్దు అని చెప్పినా వినకుండా TRS నేతలు దాడులకు దిగినట్లు చెప్పారు.

పలివెల గ్రామంలో ఓట్లు రావని.. మునుగోడులో ఓటమి భయంతో..  బస్తాల్లో రాళ్లు నింపుకుని తిరుగుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. కర్రలు, రాళ్లతో ఎందుకు తిరుగుతున్నారు ? గతంలో మీటింగ్ అడ్డుకున్న టీఆర్ఎస్ శ్రేణులు ఈరోజు రాళ్ల దాడికి పాల్పడ్డారన్నారు. TRS శ్రేణులు దాడి జరిపిన అనంతరం గ్రామంలో ప్రజలను డిస్టర్బ్ చేయకుండా ఎమ్మెల్యే ఈటల వెనక్కి తిరిగారన్నారు. దాడి చేసినవాళ్లను అరెస్ట్ చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. దాడులకు తాము భయపడమన్నారు. బీజేపీ నేతల కార్లు మాత్రం తనిఖీలు చేస్తారని..TRS వాహనాలు అలాగే వదిలేస్తారన్నారు. నవంబర్ మూడో తేదీన మునుగోడు ప్రజలు సీఎం కేసీఆర్ కు బుద్ధి చెబుతారన్నారు.