ఏకగ్రీవాల కోసం టీఆర్ఎస్ పాచికలు పారలే

ఏకగ్రీవాల కోసం టీఆర్ఎస్ పాచికలు పారలే
  • నామినేషన్​ విత్​డ్రాల చివరి రోజు ఆదిలాబాద్​లో హైడ్రామా
  • సంబంధం లేని వ్యక్తితో విత్​డ్రా చేయించేందుకు  ప్రయత్నం 
  • అడ్డుకున్న బీజేపీ లీడర్లు.. కలెక్టరేట్​ ఎదుట ధర్నా
  • నల్గొండ, ఖమ్మం, కరీంనగర్​లో బుజ్జగింపులు, బేరసారాలు
  • వెనక్కి తగ్గని ఇండిపెండెంట్లు

లోకల్​ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్​ఎస్​ పాచికలు పారలేదు. పన్నెండుకు పన్నెండు సీట్లను ఏకగ్రీవంగా దక్కించుకోవాలని ఆ పార్టీ ఎన్ని ఎత్తులు వేసినా ఆరు చోట్ల చిత్తయ్యాయి. ఇతరులు ఎవరూ పోటీలో ఉండొద్దని మొదటి నుంచీ టీఆర్​ఎస్​ లీడర్లు అస్త్రశస్త్రాలను ప్రయోగించారు. నామినేషన్​ వేయకుండా ఇండిపెండెంట్లను అడ్డుకోవడం, ఫోర్జరీ సంతకాలు అంటూ కేసులు పెట్టించడం, తాయిలాలు ఆశచూపడం.. ఇట్లా అన్ని ప్రయత్నాలు చేసినా కరీంనగర్​లోని రెండు, ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్​, నల్గొండలోని ఒక్కో స్థానంలో పోటీ ఖాయమైంది. 

నెట్​వర్క్​ / హైదరాబాద్​, వెలుగు: లోకల్​ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని సీట్లను ఏకగ్రీవం చేసుకోవాలని టీఆర్​ఎస్​ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.  మొత్తం 12 సీట్లలో ఆరు స్థానాల్లో  మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. మరో ఆరు స్థానాల్లో 26 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. నామినేషన్ల విత్​ డ్రాకు చివరి రోజైన శుక్రవారం ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో రోజంతా బేరసారాలు, హైడ్రామాలు నడిచాయి. ఆదిలాబాద్​లోనైతే ఎన్నికలతో సంబంధం లేని ఓ వ్యక్తిని తీసుకొచ్చి.. ఇండిపెండెంట్​ క్యాండిడేట్​ పెందూర్​ పుష్పను బరిలో నుంచి తప్పించే ప్రయత్నాలు జరిగాయి. ఆమెను తప్పిస్తే తమ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవమవుతుందని భావించారు. కానీ, టీఆర్​ఎస్​ తీరుపై పుష్ప, ఆమెకు మద్దతిచ్చిన తుడుందెబ్బ నేతలు, బీజేపీ లీడర్లు పోరాడడంతో.. పుష్ప కూడా బరిలో ఉన్నట్లు ఆఫీసర్లు ప్రకటించారు. మొత్తంగా కరీంనగర్​లో రెండు, నల్గొండ, ఆదిలాబాద్​, ఖమ్మం, మెదక్​లోని  ఒక్కో స్థానానికి డిసెంబర్​ 10న పోలింగ్​జరగనుంది. అదే నెల 14న కౌంటింగ్​ ఉంటుంది. రంగారెడ్డి జిల్లాలోని రెండు, మహబూబ్​నగర్​ జిల్లాలోని రెండు, నిజామాబాద్, వరంగల్​ జిల్లాల్లోని ఒక్కో స్థానంలో టీఆర్​ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. అదే నెల 14న కౌంటింగ్​ ఉంటుంది. రంగారెడ్డి జిల్లాలోని రెండు, మహబూబ్​నగర్​ జిల్లాల్లోని రెండు, నిజామాబాద్, వరంగల్​లోని ఒక్కో స్థానంలో టీఆర్​ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. 

నల్గొండలో డీల్‌ అంటూ డ్రామా

ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్​కు ముందు నుంచే ఏకగ్రీవాలపై టీఆర్​ఎస్  ఫోకస్​ పెట్టింది. ఇతరులు ఎవరూ నామినేషన్లు వేయకుండా  అన్ని ప్రయత్నాలు చేసింది. నామినేషన్ల టైంలో రంగారెడ్డి జిల్లాలోనైతే ఓ ఇండిపెండెంట్​ అభ్యర్థి నామినేషన్​ పత్రాలను కొందరు టీఆర్​ఎస్​ కార్యకర్తలు చించివేశారు. నామినేషన్ల విత్​డ్రాకు చివరిరోజైన శుక్రవారం నల్గొండలో రోజంతా  హైడ్రామా నడిచింది. ఇండిపెండెంట్లు నగేశ్​, లక్ష్మయ్య విత్​డ్రాచేసుకునేందుకు కోటి రూపాయలతో డీల్ ​కుదిరిందని టీఆర్​ఎస్​ లీడర్లు ప్రచారం చేశారు. మిగిలిన నలుగురు క్యాండిడేట్లకు ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున ప్యాకేజీ మాట్లాడామన్నారు. టీఆర్​ఎస్​ లీడర్ల నుంచి ఒత్తిళ్లు వస్తాయని గురువారం సాయంత్రం నుంచే నగేశ్​తన ఫోన్​ స్విచాఫ్ ​చేసి అందుబాటులో లేకుండా పోయారు. ఆయన జాడకనిపెట్టేందుకు పోలీస్ డిపార్ట్​మెంట్​సాయంతో సెల్​సిగ్నల్స్​ ఆధారంగా ట్రేస్ చేసి శ్రీశైలంలోని అమ్రాబాద్ ఏరియాలో ఉన్నట్లు గుర్తించారు. నగేశ్​ కోసం ఓ ఏజెంట్​ను పంపించామని టీఆర్​ఎస్​ లీడర్లు మైండ్​గేమ్​ ఆడారు. ఇక లక్ష్మయ్యతో విత్​డ్రా చేయించేందుకు బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డితో కోటి రూపాయలు ఇస్తామని టీఆర్​ఎస్​ లీడర్లు బేరసారాలు సాగించారు. కానీ అప్పటికే లక్ష్మయ్య సూర్యాపేట సమీపంలోని ఓ రెస్టార్టెంట్​లో తలదాచుకున్నారు. మిగిలిన నలుగురు క్యాండిడేట్లతో నామినేషన్లను విత్​డ్రా చేయించేందుకు ఒప్పించిన టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే భాస్కర్​రావు వాళ్లను వెంట బెట్టుకుని కలెక్టరేట్ వెళ్లారు. కానీ నగేశ్​, లక్ష్మయ్య విత్​డ్రా చేసుకోవడం లేదని తెలిసి వారిని తిప్పి పంపారు. నల్గొండ ఎమ్మెల్సీ బరిలో టీఆర్​ఎస్​ అభ్యర్థి కోటిరెడ్డితోపాటు మొత్తం ఏడుగురు నిలిచారు. 

ఏకగ్రీవాలు ఇలా..

వరంగల్​ జిల్లాలోని ఒక్క ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 14 మంది నామినేషన్లు వేయగా.. 10 మంది నామినేషన్లు రిజెక్ట్​ కాగా, మరో ముగ్గురు విత్​ డ్రా చేసుకున్నారు. దీంతో టీఆర్​ఎస్​ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  నిజామాబాద్‌‌‌‌ స్థానం నుంచి నామినేషన్ల స్ర్కూటినీ టైంకు ఒక్కటే నామినేషన్‌‌‌‌  మిగిలింది. దీంతో అదే స్థానం నుంచి ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కవిత ఏకగ్రీవమయ్యారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని రెండు స్థానాల్లో టీఆర్​ఎస్​ అభ్యర్థులు పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహబూబ్‌‌‌‌నగర్ జిల్లాలోని రెండు స్థానాలు టీఆర్​ఎస్​ ఖాతాలోకి చేరాయి. పోటీకి దిగిన ఒక ఇండిపెండెంట్​ శ్రీశైలం నామినేషన్​ విత్​డ్రా చేసుకున్నారు. దీంతో  టీఆర్​ఎస్​ అభ్యర్థులు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌‌‌‌రెడ్డి ఏకగ్రీవమయ్యారు. ఏకగ్రీవమైనవారికి గెలుపు సర్టిఫికెట్లను శుక్రవారం ఎన్నికల ఆఫీసర్లు అందజేశారు. దాదాపు ఏకగ్రీవమైన అన్ని స్థానాల్లో నామినేషన్​ వేసిన పలువురు ఇండిపెండెంట్లను సంతకాల ఫోర్జరీ పేరిట ఆఫీసర్లు రిజెక్ట్​చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 

బుజ్జగింపులు, ఆఫర్లు!

కరీంనగర్​లో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు 24 మంది పోటీపడగా.. టీఆర్ఎస్​ నేతలు బుజ్జగింపులు, బేరసారాల తర్వాత 14 మందితో విత్ డ్రా  చేయించారు. విత్ డ్రా చేసుకున్న అందరికీ రూ. 5 లక్షల చొప్పున అందించారని  ప్రచారం జరిగింది. మాజీ మేయర్, ​టీఆర్​ఎస్​ రెబల్​ సర్దార్​ రవీందర్​ సింగ్ తో విత్​డ్రా చేయించడం సాధ్యం కాకపోవడంతో టీఆర్​ఎస్​ లీడర్లు తమ ప్రయత్నాలను విరమించుకున్నారు. ఇక్కడి రెండు స్థానాల్లో టీఆర్​ఎస్​ నుంచి ఎల్.రమణ, టి. భానుప్రసాద్‌ సహా 10 మంది పోటీలో నిలిచారు. 

ఖమ్మంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ క్యాండిడేట్లతోపాటు ఇద్దరు ఇండిపెండెంట్లు పోటీలో ఉన్నారు . ముగ్గురితో నామినేషన్లు విత్ డ్రా చేయించేందుకు టీఆర్​ఎస్​ లీడర్లు మూడురోజులుగా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. భారీ మొత్తంలో ఆఫర్​ ఇస్తామన్నా తిరస్కరించడంతో ఇక్కడ పోటీ తప్పలేదు.  మెదక్​లో  కాంగ్రెస్​ పార్టీ నుంచి తూర్పు నిర్మల బరిలో ఉండడంతో ఏకగ్రీవ ప్రయత్నాలను టీఆర్​ఎస్​నేతలు ఉపసంహరించుకున్నారు. ఆమెతో పాటు టీఆర్​ఎస్​ క్యాండిడేట్​ డాక్టర్​ యాదవ రెడ్డి, దుబ్బాకకు చెందిన ఇండిపెండెంట్​ అభ్యర్థి మట్ట మల్లారెడ్డి బరిలో ఉన్నారు.