
- తమ్ముడు శిరీష్ను కాపాడుకునేందుకే నన్ను ఈ వివాదంలో లాగాడు
- థియేటర్లు బంద్ చేయాలని ఎక్కడా అనలేదని కామెంట్
హైదరాబాద్, వెలుగు: ఏపీలో సినిమా థియేటర్ల బంద్ వ్యవహారంలో మెయిన్ విలన్ దిల్ రాజే అని జనసేన నుంచి సస్పెండ్ అయిన నేత, ఈస్ట్ గోదావరి జిల్లా ఎగ్జిబిటర్ అత్తి సత్యనారాయణ ఆరోపించారు. తనపై దిల్ రాజు కక్షగట్టారని మండిపడ్డారు. సినిమా థియేటర్లు బంద్ చేయాలంటూ తాను ఎక్కడా ప్రకటన చేయలేదన్నారు. బంద్ వెనుక దిల్ రాజు, శిరీశ్, సురేశ్ బాబు, సునీల్ నారంగ్ ఉన్నారని ఆరోపించారు. కాగా, థియేటర్ల బంద్కు అనుశ్రీ ఫిలిమ్స్ అధినేత సత్యనారాయణ కారణమని దిల్ రాజు ఆరోపించారు. ఈ క్రమంలో రాజమండ్రి జనసేన ఇన్చార్జ్ పదవి నుంచి సత్యనారాయణను ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ తప్పించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంపై బుధవారం రాజమండ్రిలో అత్తి సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.
‘‘థియేటర్ల బంద్కు నేను కారణమని దిల్ రాజు ఆరోపించడం సరికాదు. సోదరుడు శిరీశ్ను కాపాడుకునేందుకే నా పేరును ఈ వివాదంలోకి లాగారు. దీనంతటికి దిల్ రాజు, శిరీశ్, సురేశ్ బాబు, సునీల్ నారంగే కారణం. పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇవ్వడంతోనే దిల్ రాజు జనసేన పేరు ఎత్తారు. ఆయన కమల్ హసన్, ఆస్కార్ స్థాయిలో నటించారు. నా రాజకీయ భవిష్యత్తుపై దెబ్బకొట్టాడు. దిల్ రాజును వదిలే ప్రసక్తే లేదు. ఈ విషయంలో కోర్టుకు వెళ్తాను’’అని అత్తి సత్యనారాయణ అన్నారు.