- పెండ్లి పేరుతో 19 మంది మహిళలకు మోసం
నల్గొండ క్రైం, వెలుగు: పెండ్లి పేరిట మహిళలను మోసం చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. నల్గొండ పట్టణానికి చెందిన తలకొప్పుల విలియమ్స్ నార్కట్పల్లి పీహెచ్సీలో ల్యాబ్టెక్నిషియన్గా చేస్తున్నాడు. అలాగే స్థానికంగా ఉండే చర్చిలో పియానో వాయించేవాడు. పట్టణంలోని బీటీఎస్కు చెందిన ఓ మహిళతో 9 ఏండ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఎన్ జీ కాలేజీ సమీపంలోని అద్దె గదిలో ఆమెను ఉంచి బంధువులందరికి భార్యగా పరిచయం చేశాడు. అలా ఆమె డబ్బు రూ.20 లక్షల వరకు వాడుకున్నాడు.
అక్టోబర్ 31న డబ్బుల విషయమై ఆ మహిళ అడగడంతో ఆమెను చంపుతానని బెదిరించాడు. దాంతో ఆమె గోడ దూకి తాను పారిపోయింది. తర్వాత విలియమ్స్ గురించి ఆరా తీయగా అతడికి అప్పటికే మరొకరితో పెండ్లయిందని తెలిసింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. చర్చికి వచ్చే యువతులు, మహిళలకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడని, ఇలా 19 మంది మహిళలను మోసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు విలియమ్స్ను విచారిస్తున్న సమయంలో గుండె నొప్పి వచ్చిందని హైడ్రామా చేయడంతో పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అంతా బాగానే ఉందని, కావాలనే డ్రామా ఆడుతున్నట్లు డాక్టర్లు చెప్పారు. దీంతో వన్టౌన్ పోలీసులు విలియమ్స్ను అరెస్టు చేశారు. ఐపీసీ 376, 377, 382, 342, 420 కింద అతడిపై కేసు నమోదు చేశారు.