
ఆస్ట్రేలియాతో పెర్త్ స్డేడియం వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. ఎన్నో అంచనాల ఆమధ్య ఆసీస్ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియాకు మంచి ఆరంభం దక్కలేదు. మరోవైపు సొంతగడ్డపై మొదట బౌలింగ్ లో చెలరేగిన ఆస్ట్రేలియా ఆ తర్వాత బ్యాటింగ్ లోనూ సమిష్టిగా రాణించింది. ఆదివారం (అక్టోబర్ 19) ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియాపై ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
కెప్టెన్ మిచెల్ మార్ష్ (46) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడితే.. వికెట్ కీపర్ ఫిలిప్స్ (37) రాణించాడు. డీఎల్ఎస్ పద్దతిలో 26 ఓవర్లకు సవరించిన ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 26 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 21.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసి గెలిచింది.
ఈ విజయంతో ఆస్ట్రేలియా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో 1-0ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే గురువారం (అక్టోబర్ 23) అడిలైడ్ వేదికగా జరుగుతుంది. డక్ వర్త్ లూయిస్ పద్దతిలో సవరించిన 131 పరుగుల టార్గెట్లో ఆస్ట్రేలియాకు మంచి ఆరంభం లభించలేదు.
తొలి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి మంచి టచ్లో కనిపించిన ట్రావిస్ హెడ్ను రెండో ఓవర్లో అర్షదీప్ సింగ్ ఔట్ చేశాడు. ఆ తర్వాత షార్ట్తో కలిసి కెప్టెన్ మార్ష్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. రెండో వికెట్ కు 34 పరుగులు జోడించిన తర్వాత షార్ట్ 8 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అక్షర్ పటేల్ బౌలింగ్ లో ఔటయ్యాడు.
44 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్ జట్టును మార్ష్, ఫిలిప్ ఆదుకున్నారు. భారత బౌలర్లను అలవోకగా ఎదర్కొంటూ ఆసీస్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. మూడో వికెట్ కు 55 పరుగులు జోడించిన తర్వాత వీరిద్దరి భాగస్వామ్యాన్ని సుందర్ విడగొట్టాడు. భారీ షాట్ కు ప్రయత్నించిన ఫిలిప్ ఫైన్ లెగ్ లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రెన్ షాతో కలిసి మార్ష్ ఆసీస్ కు విజయాన్ని అందించాడు. ఇండియా బౌలర్లలో అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, సుందర్ తలో వికెట్ పడగొట్టారు.
బ్యాటింగ్లో ఇండియా విఫలం:
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా తక్కువ స్కోర్ కే పరిమితమైంది.26 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాహుల్ 38 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. మాథ్యూ కుహ్నేమాన్, జోష్ హేజల్ వుడ్, మిచెల్ ఒవేన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఎల్లిస్, స్టార్క్ లకు తలో వికెట్ దక్కింది. ప్రారంభమైన ఈ మ్యాచ్ లో టాపార్డర్ ఘోరంగా విఫలం కాగా.. మిడిల్ ఆర్డర్ లో కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ రాణించి ఇండియాకు ఒక మోస్తరు స్కోర్ అందిచారు.
ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసింది. స్టార్క్, హేజల్ వుడ్ బౌలింగ్ ధాటికి ఓపెనర్లు రోహిత్, గిల్ ఇబ్బందిపడ్డారు. కంగారూల పదునైన బౌలింగ్ ధాటికి మన ఓపెనర్లు తడబడ్డారు. క్రీజ్ లో ఉన్నంత సేపు ఇబ్బంది పడిన రోహిత్ 14 బంతుల్లో 8 పరుగులకే చేసి ఔటయ్యాడు. హేజల్ వుడ్ బౌలింగ్ లో స్లిప్ లి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన కోహ్లీ పరుగుల ఖాతా తెరవడానికి ఇబ్బందిపడ్డాడు. తొలి 6 బంతుల్లో ఒక్క పరుగు కూడా చేయని కోహ్లీ ఒత్తిడిలో పాయింట్ దిశగా షాట్ ఆడి క్యాచ్ ఇచ్చాడు. ఎల్లిస్ తన తొలి ఓవర్లోనే గిల్ ను ఔట్ చేసి ఇండియాను కష్టాల్లో పడేశాడు.
కాసేపటికే ఇండియా వెంటనే శ్రేయాస్ అయ్యర్ వికెట్ ను కోల్పోయింది. హేజల్ వుడ్ బౌలింగ్ లో వికెట్ కీపర్ జోష్ ఫిలిప్ కు క్యాచ్ ఇచ్చి 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద శ్రేయాస్ ఔటయ్యాడు. 45 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఇండియాను అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (36) ఆదుకున్నారు. ఐదో వికెట్ కు స్వల్ప భాగస్వామ్యాన్ని నెలకొల్పి స్కోర్ కార్డును ముందుకు తీసుకెళ్లారు. అక్షర్ 31 పరుగులు చేసి ఔటైనా.. సుందర్ తో రాహుల్ మరో కీలక భాగస్వామ్యాన్ని నిర్మించాడు. చివర్లో నితీష్ కుమార్ రెడ్డి (19) రెండు సిక్సర్లు కొట్టడంతో ఇండియా స్కోర్ 136 పరుగులకు చేరింది. వర్షం కారణంగా ఆస్ట్రేలియా టార్గెట్ ను 131 పరుగులకు సవరించారు.