మైండ్‎లో అనుకుంటే.. అక్షరాల్లోకి మారిపోతుంది.. వినూత్న టెక్నాలజీకి ఆస్ట్రేలియా పరిశోధకుల శ్రీకారం

మైండ్‎లో అనుకుంటే.. అక్షరాల్లోకి మారిపోతుంది.. వినూత్న టెక్నాలజీకి ఆస్ట్రేలియా పరిశోధకుల శ్రీకారం

సిడ్నీ: మెదడులోని ఆలోచనలకు అక్షరరూపమిచ్చే వినూత్న టెక్నాలజీని ఆస్ట్రేలియా పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు. బ్రెయిన్ వేవ్స్‎ను పదాల్లోకి తర్జుమా చేసేలా కృత్రిమ మేధ(ఏఐ)ను డెవలప్ చేస్తున్నారు. ప్రస్తుతం మెదడు ఆరోగ్యాన్ని తెలుసుకునేందుకు వైద్యులు ఉపయోగిస్తున్న ఎలక్ట్రోఎన్ సెఫలోగ్రామ్​(ఈఈజీ)ని ఉపయోగించి ఆలోచనలను అక్షరాల్లోకి మార్చేలా ఏఐని తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం ఈ ఏఐ టెక్నాలజీ బ్రెయిన్ వేవ్స్‎ను డీ కోడ్ చేసి చిన్న చిన్న పదాలను రాస్తోందని సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. 

ఈమేరకు ఛార్లెస్ ఝౌ అనే పీహెచ్​డీ విద్యార్థి, పరిశోధనలో అతడికి గైడ్‎గా వ్యవహరిస్తున్న చిన్ టెంగ్ లిన్, డాక్టర్ లియాంగ్​ఈ పరిశోధనలో పాలుపంచుకుంటున్నారు. ఈఈజీ ద్వారా గ్రహించిన బ్రెయిన్ వేవ్స్‎ను డీ కోడ్ చేసి పదాల్లోకి మార్చేలా ఏఐ టెక్నాలజీని తీర్చిదిద్దుతున్నారు. డాక్టర్ లియాంగ్ దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలించగా.. ఆయన మెదడులోని ఆలోచనలను గ్రహించిన ఏఐ వాటిని ఇలా అక్షరాల్లోకి మార్చి ఇలా  ‘‘అయామ్ జంపింగ్​హ్యాపిలీ, ఇట్స్ జస్ట్ మీ” అని చూపించింది. కాగా, ప్రస్తుతానికి ఈ టెక్నాలజీతో చిన్న చిన్న పదాలను మాత్రమే డీ కోడ్ చేసే వీలుకలుగుతోందని పరిశోధకులు తెలిపారు. ఎలాన్ మస్క్ కంపెనీ న్యూరాలింక్ కంపెనీ సైంటిస్టులు కూడా ఇదే తరహా ప్రాజెక్టు రూపకల్పన కోసం శ్రమిస్తున్నారు.