
మెక్కే: సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా రికార్డు విజయం సాధించింది. ట్రావిస్ హెడ్ (103 బాల్స్లో 17 ఫోర్లు, 5 సిక్స్లతో 142), కామెరూన్ గ్రీన్ (55 బాల్స్లో 6 ఫోర్లు, 8 సిక్స్లతో 118 నాటౌట్), కెప్టెన్ మిచెల్ మార్ష్ (106 బాల్స్లో 6 ఫోర్లు, 5 సిక్స్లతో 100) సెంచరీలతో దుమ్మురేపడంతో.. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో ఆసీస్ 276 రన్స్ తేడాతో ప్రొటీస్ను చిత్తు చేసింది. వన్డేల్లో ఆసీస్కు రెండో అతి పెద్ద విజయం. సౌతాఫ్రికా వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే అతి పెద్ద ఓటమి కావడం గమనార్హం.
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆసీస్ 50 ఓవర్లలో 431/2 స్కోరు చేసింది. వన్డేల్లో కంగారూలకు ఇది రెండో అత్యధిక స్కోరు కావడం విశేషం. హెడ్, మార్ష్ తొలి వికెట్కు 34.1 ఓవర్లలో 250 రన్స్ జత చేశారు. అయితే 17 రన్స్ తేడాలో ఈ ఇద్దరూ ఔటయ్యారు. దాంతో 267/2 స్కోరు వద్ద వచ్చిన గ్రీన్, అలెక్స్ క్యారీ (50 నాటౌట్) మూడో వికెట్కు 164 రన్స్ జత చేశారు. కేశవ్ మహారాజ్, ముతుస్వామి చెరో వికెట్ తీశారు.
తర్వాత ఛేజింగ్లో సౌతాఫ్రికా 24.5 ఓవర్లలో 155 రన్స్కు ఆలౌటైంది. డెవాల్డ్ బ్రెవిస్ (49) టాప్ స్కోరర్. టోనీ డి జోర్జి (33), టెంబా బవూమ (19)తో సహా అందరూ ఫెయిలయ్యారు. ఇన్నింగ్స్లో ఆరుగురు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. కూపర్ కనోలీ 5, బార్ట్లెట్, అబాట్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. హెడ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, 37 రన్స్, 6 వికెట్లు తీసిన కేశవ్ మహారాజ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.