
- 2020 రాజేంద్రనగర్ ఆర్డీవో నివేదికకు, ప్రస్తుత రిపోర్టుకు తేడా
- అప్పట్లో చెరువు స్థలంగా పేర్కొన్న ఆర్డీవో
చందానగర్, వెలుగు: శేరిలింగంపల్లి మండలం హఫీజ్పేట పరిధిలో రేగులకుంట చెరువు స్థలం కబ్జాపై అధికారులు స్పందించారు. వెలుగు దినపత్రికలో రెండు రోజుల కింద రేగులకుంట జాగాకు ఎసరు అనే హెడ్డింగ్తో వచ్చిన కథనానికి స్పందించిన శేరిలింగంపల్లి రెవెన్యూ, ఇరిగేషన్శాఖ అధికారులు మంగళవారం సర్వే చేపట్టారు. చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ఎక్కడి వరకు విస్తరించి ఉందో చూస్తూ హద్దులు చెక్చేశారు.
ప్రస్తుతం బై నంబర్లు వేసి చేపడుతున్న నిర్మాణం వద్ద సర్వే చేపట్టిన అధికారులు.. బఫర్ జోన్ బయటే ఉన్నట్టు తేల్చి గుర్తులు పెట్టారు. అయితే, ప్రస్తుత నిర్మాణంతో పాటు పక్కనే ఉన్న అపార్ట్మెంట్లోని కొంత భాగం, వెనుక వైపు ఉన్న పలు నిర్మాణాలు చెరువు స్థలాన్ని కబ్జా చేసి కట్టారని 2020లో అప్పటి రాజేంద్రనగర్ఆర్డీవో సర్వే చేసి రిపోర్టు ఇచ్చారు.
కానీ, ఇప్పుడు 513/2, 513/3, 516 తూర్పు భాగం ప్లాట్ల నంబర్లతో చేపడుతున్న నిర్మాణం మాత్రం బఫర్జోన్బయట ఉందని అధికారులు తేల్చడం వెనక మతలబు ఏమిటో అర్థం కావడం లేదని స్థానికులు అంటున్నారు. చెరువు స్థలాన్ని కబ్జా చేసి, రిజిస్ట్రేషన్ చేసుకోవడం, బై నంబర్లు వేసి ఇరిగేషన్ నుంచి ఎన్ఓసీ, బల్దియా నుంచి బిల్డింగ్నిర్మాణానికి అనుమతులు తీసుకురావడం వరకు అన్నీ ఓ డివిజన్ కార్పొరేటర్ దగ్గరుండి చూసుకున్నట్టు తెలుస్తోంది.