- డ్రైవర్లు కరోనా టైమ్లోనూ కమీషన్ తగ్గించని క్యాబ్ సంస్థలు
- వచ్చే కాస్త పైసలూ పెరిగిన పెట్రోల్, డీజిల్కే సరి
- ఇంకో మార్గం లేక కార్లమ్ముకుంటున్న కొందరు
- వేరే పనికి మరికొందరు.. సొంతూర్లకు ఇంకొందరు
ఇతని పేరు ప్రశాంత్. హైదరాబాద్లో డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఐటీ కంపెనీలకు బండి నడిపించేవాడు. ప్రస్తుతం అన్ని సంస్థల్లో వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వడంతో పని పోయింది. మూడు నెలలుగా ఇదే పరిస్థితి ఉండటంతో పూట గడవడం కష్టమైంది. పిల్లల బడి ఫీజు కట్టలేదు. బండి కిస్తీలు పెరిగిపోతున్నాయి. దీంతో బతుకు బండి నెట్టుకురావడానికి ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర చాయ్, సమోసాలు, చిన్న కిరాణ సామాన్లను బండిలో పెట్టుకుని అమ్ముతున్నాడు.
హైదరాబాద్, వెలుగు: కరోనా వల్ల జనం ఆటోలు, క్యాబ్లు ఎక్కడం తగ్గించడంతో డ్రైవర్లందరికీ పని కరువైంది. ఐటీ కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇస్తుండటంతో వీళ్లకు వర్క్ లేకుండా పోయింది. వస్తున్న ఆ కాస్త గిరాకీ పైసలు కూడా పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లకే సరిపోతుండటంతో డ్రైవర్లు ఆగమైతున్నారు. ఓలా, ఉబర్లు సాయం చేయకపోగా.. 20 శాతం కమీషన్ కట్ చేస్తుండటంతో పైసల్లేక అవస్థ పడుతున్నారు. ఎంతకాలం ఇట్ల ఇబ్బంది పడ్తమని కొందరు వేరే చిన్నాచితకా పనులు వెతుక్కుంటుంటే ఇంకొందరు కార్లను అమ్ముకుంటున్నారు. మరికొందరు పట్నం వదిలి సొంతూర్లకు పోతున్నారు.
రూ. 500 కూడా వస్తలె
రాష్ట్రంలో లక్షకు పైగా క్యాబ్లు, 5 లక్షల వరకు ఆటోలున్నాయి. కరోనా లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా కేంద్రం సూచనలతో రాష్ట్ర సర్కారు క్యాబ్లు, ఆటోలు నడుపుకోవడానికి అనుమతిచ్చింది. కానీ కరోనా వ్యాప్తి భయంతో జనం క్యాబ్స్, ఆటోలలో ఎక్కడం లేదు. సొంత వెహికల్స్కే ప్రయారిటీ ఇస్తున్నారు. మరోవైపు చాలా సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చాయి. లాక్డౌన్ తర్వాత జూన్ 7 నుంచి నేటి వరకు పెట్రోల్ ధరపై లీటరుకు రూ.8.50, డీజిల్పై రూ.10.01 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్లో పెట్రోల్ రేటు లీటరుకు రూ.82.79, డీజిల్ రూ. 77.60గా ఉంది. సడలింపుల తర్వాత ఉబర్, ఓలా సంస్థలు 50 శాతం మేర వాహనాలను అందుబాటులోకి తెచ్చినా ప్రయాణికుల్లేక వెలవెలబోతున్నాయి. 18 గంటల నుంచి 20 గంటలు ఓలా, ఉబర్ యాప్లు ఓపెన్ చేసినా ఆశించినంతగా బుకింగ్లు రావట్లేదు. వచ్చినా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో గిట్టుబాటు కావట్లేదని డ్రైవర్లు వాపోతున్నారు.
ట్యాక్స్లు, కిస్తీలు కట్టలేక
ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మూడు నెలలకోసారి ట్యాక్స్ కట్టాలి. వాహనం, సీట్లను బట్టి ట్యాక్స్ ఉంటుంది. 3 నెలలుగా గిరాకీల్లేవని, వేలకు వేలు ట్యాక్స్ ఎట్లా కట్టాలని డ్రైవర్లు వాపోతున్నారు. మరోవైపు బండి కిస్తీలు కట్టాలని ఫైనాన్షియర్లు ఒత్తిడి చేస్తుండటంతో కొంత మంది బండ్లను సెకండ్ హ్యాండ్లో అమ్ముకుంటున్నారు. కొందరు పని లేక ఇంటి ముఖం పడుతున్నారు.
పని లేక పండ్లు అమ్ముతున్న
ఉబర్లో బండి నడిపేవాడ్ని. బండి నడిస్తే గానీ పూట గడవని పరిస్థితి. లాక్డౌన్తో పని లేకుండా పోయింది. నా బండికి ఇన్సూరెన్స్, ఫిట్నెస్, స్పీడ్ గవర్నర్ వ్యాలిడ్గా లేవు. వీటిని కేంద్రం పొడిగించినా ఉబర్ మాత్రం ఐడీ బ్లాక్ చేసింది. వ్యాలిడ్ చేసుకోవడానికి అన్నీ కలిపి రూ. 40 నుంచి రూ. 50 వేలు అవుతాయి. అసలే డబ్బుల్లేవ్. ఎట్ల కట్టాలి. దీంతో కారులో మామిడి పండ్లు అమ్ముతున్న.
-సయ్యద్ జాకీర్ హుస్సేన్, డ్రైవర్
కంపెనీలు 5 శాతం కమీషనే తీసుకోవాలి
కరోనాతో డ్రైవర్లకు పని లేకుండా పోయింది. జనాలు క్యాబ్లు, ఆటోలు ఎక్కడం లేదు. ఇలాంటి టైమ్లోనూ కంపెనీలు 20 శాతం కమీషన్ తీసుకుంటున్నాయి. కాస్త ఆలోచించి 5 శాతమే తీసుకోవాలి. డ్రైవర్లకు ఆరోగ్య బీమా కల్పించాలి. ప్రభుత్వం ఆదుకోవాలి. నేను కూడా ఊరికి పోయి పొలం పని చేసుకుంటున్నా.
-సలావుద్దీన్, చైర్మన్, తెలంగాణ ట్యాక్సీస్ అండ్ డ్రైవర్స్ జేఏసీ