
అన్ని రకాల వెహికల్స్కు డిమాండ్ తగ్గడం, ఖర్చులు పెరిగిపోవడం, జీఎస్టీ భారం వాహనరంగానికి శాపంగా మారాయి. దీనికితోడు బీమా, ఫైనాన్స్ రేట్లు పెరగడం, కస్టమర్ల సెంటిమెంట్ దెబ్బతినడంతో అమ్మకాలు మందగించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమను ఆదుకోవాలని వాహన పరిశ్రమ కోరుతోంది.
న్యూఢిల్లీ: ఈ ఏడాది వాహన రంగానికి కలిసి రాలేదు. దాదాపు ప్రతి నెలా అమ్మకాలు కిందకు జారాయి. దీంతో కొన్ని కంపెనీలు ఉత్పత్తిని పాక్షికంగా నిలిపివేశాయి. ఇన్వెంటరీ పేరుకుపోవడంతో డీలర్లకు ఏం చేయాలో పాలుపోవడంతో లేదు. డిమాండ్ తగ్గుదల, ఖర్చులు పెరగడం, ఉద్గార ప్రమాణాలు ఇందుకు కారణం. అందుకే ఈ ఏడాది అమ్మకాలు ప్రతి నెలా పడిపోతున్నందున, తమను ఆదుకోవాలని వాహన పరిశ్రమ ప్రభుత్వాన్ని కోరుతోంది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి మరో మూడు రోజులే మిగిలి ఉండడంతో తమ కోరికల చిట్టాను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ముందు ఉంచింది. ఆమె తమ తమ సమస్యలు పరిష్కరిస్తారని గంపెడాశలు పెట్టుకున్నామని సియామ్(SIAM) ప్రతినిధి ఒకరు అన్నారు. ప్రస్తుతం వాహన తయారీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల వివరాలు ఇలా ఉన్నాయి.
జీఎస్టీ తగ్గింపు
అధిక జీఎస్టీ తమకు పెనుభారంగా మారిందని వాహన పరిశ్రమ అంటున్నది. దీనివల్ల ధరలు విపరీతంగా పెరిగి డిమాండ్ తగ్గిపోతోందని ఆక్షేపిస్తోంది. ప్యాసింజర్ కార్, కమర్షియల్, టూ, త్రీవీలర్లపై జీఎస్టీనీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) కోరుతోంది.
బీమా పాలసీ రేట్ల పెరుగుదల
ప్యాసింజర్, టూవీలర్ల థర్డ్పార్టీ బీమా ధరలు భారీగా పెరిగాయి. వాహనాల అమ్మకాలు పడిపోవడానికి ఇదీ ఒక కారణం. వెహికిల్ ఫైనాన్స్ వడ్డీరేట్లను కూడా కొన్ని కంపెనీలు పెంచాయి. ఇవి కూడా పరిశ్రమకు ప్రతికూలంగా మారాయి.
ఎన్బీఎఫ్సీలను రక్షించండి
ఐఎల్ఎఫ్ఎస్ వంటి ఎన్బీఎఫ్సీలు దివాలా తీయడం వల్ల వాహన పరిశ్రమకు ఆర్థిక సమస్యలు పెరిగాయి. మార్కెట్లో లిక్విడిటీ దొరక్కపోవడమే ఇందుకు కారణం. ఫలితంగా వడ్డీరేట్లు పెరిగాయి. ఎన్బీఎఫ్సీలకు లిక్విడిటీ కోసం స్పెషల్ విండో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే దివాలా తీసిన కంపెనీలకు దీంతో ఉపయోగం ఉండదు. అందుకే ఎన్బీఎఫ్సీలకు విరివిగా నిధులు ఇవ్వాలని వాహన పరిశ్రమ కోరుతోంది.
ఖర్చులు పెరగడం
కాలుష్య నియంత్రణకు ఉద్దేశించిన బీఎస్–6 ప్రమాణాలు అమల్లోకి వస్తుండటం వల్ల వీటికి అనుగుణమైన ఇంజన్లను తయారు చేయడానికి కంపెనీలు భారీగా ఇన్వెస్ట్ చేశాయి. ఫలితంగా ఉత్పత్తి వ్యయం పెరిగింది. అమ్మకాలను పెంచడానికి ప్రభుత్వం వ్యవసాయ రంగంపై ఎక్కువ పెట్టుబడులు పెట్టాలి. దీనివల్ల ట్రాక్టర్లకు, టూవీలర్లకు డిమాండ్ పెరుగుతుంది.
వాణిజ్య వాహన రంగంలో మేకిన్ ఇండియాను ప్రోత్సహించాలి. కార్మికుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలి. ఈవీలపై జీఎస్టీని ఐదుశాతానికి తగ్గించాలి.
పాతవి తిరగనీయొద్దు
కాలుష్యానికి కారణమయ్యే పొగను విడుదలచేసేవి, 15 ఏళ్లు పైబడ్డ వాహనాలను నిషేధించాలని సియామ్ కోరుతోం ది. దీని వల్ల కాలుష్యం తగ్గడంతోపాటు తమ అమ్మకాలూ పెరుగుతాయని ఆశిస్తోం ది. ఇంపోర్టెట్ కమర్షియల్ వాహనాలు, సెమీ–నాక్ డ్ డౌన్ వాహనాలపై కస్టమ్ డ్యూటీ పెంచాలని ప్రభుత్వానికి విన్నవించింది.
ఈవీలపై క్లారిటీ కావాలట
2030 నాటికి దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ , డీజిల్ వాహనాలను నిషేధించేందుకు చర్యలు తీసుకోవాలని, ఈవీలు మాత్రమే ఉండాలని నీతి ఆయోగ్ ఆర్థికశాఖను ఆదేశించింది. ఈనేపథ్యంలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీలు)తయారీకి సమగ్ర విధానాన్ని ప్రకటించాలని సియామ్ కోరింది. కేవలం పదేళ్లలో పెట్రోల్ ,డీజిల్ వాహనాలను తొలగించడం సాధ్యంకాదని కంపెనీలు అంటున్నాయి. పెట్టుబడులు సమకూర్చుకోవాలని కాబట్టి ఇందుకు కొంతగడువు ఇవ్వాలని కోరుతున్నాయి.