న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్ రిటెయిల్ అమ్మకాలు జూన్2023 లో 10 శాతం గ్రోత్ రికార్డు చేశాయి. ప్యాసింజర్ వెహికల్స్, టూ వీలర్ల సేల్స్ సైతం పెరిగినట్లు ఫాడా గురువారం వెల్లడించింది. 2023 జూన్ నెలలో మొత్తం రిటెయిల్ సేల్స్ ఏడాది కిందటి 17,01,105 యూనిట్ల నుంచి 18,63,868 యూనిట్లకు పెరిగినట్లు తెలిపింది. ఈ నెలలో ప్యాసింజర్ వెహికల్స్ రిటెయిల్ అమ్మకాలు 5 శాతం పెరిగి 2,95,299 యూనిట్లకు చేరినట్లు పేర్కొంది. అలాగే, టూ వీలర్ల సేల్స్ సైతం 7 శాతం ఎగసి 13,10,186 యూనిట్లకు చేరాయని వివరించింది. త్రీ వీలర్స్ అమ్మకాలు భారీగా అంటే 75 శాతం ఎక్కువై 86,511 యూనిట్లకు చేరినట్లు ఫాడా వెల్లడించింది.
మొత్తం రిటెయిల్ సేల్స్లో ఏడాది కిందటి కాలంతో పోలిస్తే ఈ ఏడాది జూన్లో 10 శాతం గ్రోత్ రికార్డయిందని, కానీ ఇంతకు ముందు నెలతో పోలిస్తే మాత్రం 8 శాతం తగ్గిందని ఫాడా ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా చెప్పారు. జూన్ 2023 లో ట్రాక్టర్ల రిటెయిల్ అమ్మకాలు 45 శాతం పెరిగాయి. ఈ నెలలో 98,660 ట్రాక్టర్లు అమ్ముడయ్యాయి. ఇక కమర్షియల్ వెహికల్స్ అమ్మకాలు కొద్దిగానే పెరిగాయి. జూన్ నెల సేల్స్ కొంత నెమ్మదించినప్పటికీ, లాంగ్ టర్మ్ గ్రోత్ మెరుగ్గానే ఉంటుందని సింఘానియా చెప్పారు. కొంత మంది ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్ల నుంచి సప్లయ్పరమైన ఇబ్బందులను టూ వీలర్ కంపెనీలు ఎదుర్కొన్నాయని పేర్కొన్నారు. కొత్త మోడళ్లు, ఫెస్టివల్ ప్రమోషన్లు వంటివి టూ వీలర్ అమ్మకాలను భారీగా పెంచలేకపోయాయని సింఘానియా తెలిపారు. మే నెలతో పోలిస్తే టూ వీలర్ల సేల్స్జూన్ 2023 లో 12 శాతం తగ్గిపోయాయి.