న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు గ్లోబల్ ట్రెండ్స్కు అనుగుణంగా విమానాల ఇంధనం.. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఎఫ్) ధరను 5.4 శాతం పెంచాయి. ఢిల్లీలో ఏటీఎఫ్ ధర కిలోలీటరుకు రూ.5,133.75 పెరిగి రూ.99,676.77కు చేరింది. ఇది వరుసగా మూడో నెల పెంపు.
విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చులలో ఇంధనం వాటానే దాదాపు 40 శాతం ఉంటుంది. మరోవైపు హోటళ్లు, రెస్టారెంట్లు ఉపయోగించే 19-కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.10 తగ్గించి రూ.1,580.50 చేశారు.
ఇది వరుసగా రెండో తగ్గింపు. ఈ ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు మొత్తం రూ.223 తగ్గింది. ఇండ్లలో వాడే ఎల్పీజీ (14.2-కిలోల సిలిండర్) ధర మారలేదు. ప్రస్తుతం దీని రేటు రూ.853 వద్ద ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలూ మారలేదు.
