
గచ్చిబౌలి, వెలుగు : సైబర్ మోసాల బారిన పడి రూ.50 వేల వరకు డబ్బు కోల్పోయిన బాధితులు స్థానిక పీఎస్ లో కంప్లయింట్ చేయాలని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి సూచించారు. సైబర్ క్రైమ్స్ కేసుల ఎఫ్ఐఆర్ విషయంలో బాధితులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కొన్ని సూచనలు చేస్తూ పోలీసులకు బుధవారం ఆదేశాలు జారీ చేశారు.
గతంలో సైబర్ మోసాల్లో, ఆర్థిక నేరాల్లో రూ. లక్షా 50 వేల కంటే ఎక్కువ మొత్తంలో కోల్పోతే బాధితులు సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ పీఎస్ లో కంప్లయింట్ చేసేవారు. అంతకంటే తక్కువ మొత్తం అయితే స్థానిక పీఎస్ కు వెళ్లేవారు. ఇటీవల కాలంలో సైబర్ మోసాలు ఎక్కువవుతుండటంతో దర్యాప్తు ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ సీపీ అవినాష్మహంతి కంప్లయింట్స్, దర్యాప్తు విషయాల్లో పలు సూచనలు చేశారు.
సైబర్ మోసాల బారిన పడి రూ. 50 వేల వరకు పోగొట్టుకుంటే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయొచ్చు. ఆ కేసులను ఇన్ స్పెక్టర్ / డీఐ ర్యాంక్ అధికారులు దర్యాప్తు చేస్తారు. సైబర్ క్రైమ్, ఆన్లైన్లో రూ. 50 వేల కంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు పోగొట్టుకుంటే సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. ఆ కేసులను సైబర్ క్రైమ్స్ పీఎస్ కు చెందిన ఇన్ స్పెక్టర్ ర్యాంక్ అధికారి దర్యాప్తు చేస్తారు. సైబర్ నేరాలకు సంబంధించిన ఇతర ఫిర్యాదులను స్థానిక పోలీస్ స్టేషన్ లో ఇవ్వాలి.