వివేకా హత్య కేసులో అవినాష్ మరో అఫిడవిట్ దాఖలు

వివేకా హత్య కేసులో అవినాష్ మరో అఫిడవిట్ దాఖలు

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో మరో అఫిడవిట్ దాఖలు చేశారు. వివేకా కూతురు సునీత ఇంప్లీడ్ పిటిషన్ వెనక సీబీఐ హస్తముందని అవినాష్ అఫిడవిట్ లో పేర్కొన్నారు. వివేకా అల్లుడు రాజశేఖర్, వివేకా రెండవ భార్య షమీమ్ ల పాత్రపై సీబీఐ దర్యాప్తు చేయటం లేదన్న ఆయన... వివేకాది హార్ట ఎటాక్ అని తాను ఎక్కడా చెప్పలేదని అఫిడవిట్ లో తెలిపారు. శశికళ అనే మహిళతో అసలు తాను మాట్లాడలేదన్నారు. శశికళ ఇదే అంశాన్ని సీబీఐకి చెప్పిందని, సీబీఐ దాఖలు చేసిన రెండు ఛార్జిషీట్ లలోనూ సిట్ దర్యాప్తు నివేదికను పరిగణలోకి తీసుకోలేదుని అవినాష్ రెడ్డి అఫిడవిట్ లో ఆరోపించారు. మార్చి10న జరిగిన విచారణలో తన గుగుల్ టేక్ఔట్ డేటాను విచారణలో సీబీఐ అడిగిందన్నారు. 
పారదర్శకంగా విచారణ జరిపితే ఇవ్వడానికి తాను సిద్ధమని అవినాష్ స్పష్టం చేశారు.

అంతకుముందు  వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు... తీర్పును రిజర్వ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తుది తీర్పు వెల్లడయ్యేవరకు అవినాష్ పై తదుపరి చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు సూచించింది. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో (మార్చి14న) రేపు సీబీఐ విచారణకు హాజరుకాకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరిన అవినాష్ తరపు న్యాయవాది కోరారు. అందుకు సీబీఐకి లేఖ పెట్టుకోవాలని హైకోర్టు చెప్పింది. అంతకుముందు సీబీఐ కార్యాలయం వద్ద అవినాష్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.