హైదరాబాద్, వెలుగు: నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ కావడంతో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులకు బీఫారాల పంపిణీని మొదలుపెట్టింది. ఆదివారం గాంధీభవన్లో ఏఐసీసీ ఇన్చార్జ్ కార్యదర్శులు పీసీ విశ్వనాథ్, రోహిత్ చౌదరి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ 60 మంది క్యాండిడేట్లకు బీ ఫారాలను అందజేశారు. ఇప్పటివరకు రెండు విడతల్లో వంద మంది అభ్యర్థులను ప్రకటించగా.. మరో 19 మందిని ఖరారు చేయాల్సి ఉంది.
37 మంది సోమవారం బీఫారాలు తీసుకునే అవకాశం ఉంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఆదివారం ఉదయం బీఫారాన్ని అందజేశారు. జగిత్యాల బరిలో నిలిచిన జీవన్రెడ్డి తరఫున ఆయన కుమారుడు బీఫారం తీసుకున్నారు. నిర్మల్ అభ్యర్థి శ్రీహరి రావు తరఫున ఆయన కూతురు, కుత్బుల్లాపూర్ అభ్యర్థి కొలను హన్మంత్ రెడ్డి తరఫున ఆయన కూతురు, కుమారుడు బీఫారాలను అందుకున్నారు.
కల్వకుర్తి అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి, కంటోన్మెంట్ అభ్యర్థి గద్దర్ కూతురు వెన్నెల, జూబ్లీహిల్స్ అభ్యర్థి అజారుద్దీన్, గోషామహల్ అభ్యర్థి సునీతారావు, పాలకుర్తి అభ్యర్థి యశశ్విని, సికింద్రాబాద్ అభ్యర్థి ఆడెం సంతోష్, చాంద్రాయణగుట్ట అభ్యర్థి బోయ నగేశ్ తదితరులు గాంధీభవన్లో బీఫారాలు తీసుకున్న వారిలో ఉన్నారు. కాగా, ఇప్పటిదాకా ప్రకటించిన వంద స్థానాల్లో మూడు స్థానాలకు అభ్యర్థులను మార్చే అవకాశం ఉన్నట్టు తెలిసింది.