- ఆరేండ్ల పాప రెండు రోజులుగా మిస్సింగ్..
- చివరకు పొరుగింట్లో డెడ్బాడీ
- ఇంటి ఓనర్ను అరెస్టు చేసిన పోలీసులు.. యూపీలో ఘటన
లక్నో: యూపీలో దారుణం జరిగింది. గురువారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన ఆరేండ్ల చిన్నారి.. శనివారం పక్కింట్లో డెడ్బాడీగా కనిపించింది. దీంతో ఆ ఇంటి ఓనర్ను పోలీసులు అరెస్టు చేశారు. చిన్నారి డెడ్బాడీని పోస్టుమార్టంకోసం పంపించారు. పోలీసుల వివరాల ప్రకారం.. హాపూర్ సిటీకి చెందిన చిన్నారి గురువారం సాయంత్రం తండ్రి దగ్గర రూ.5 తీసుకుని షాపుకు వెళ్లింది. ఎంతసేపటికీ తిరిగి ఇంటికి రాలేదు. ‘‘గురువారం రాత్రంతా వెతికిన తండ్రి శుక్రవారం పోలీసులకు కంప్లైంట్ చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టాం. పొరుగింట్లో నుంచి దుర్వాసన వస్తున్నట్టు సమాచారం వచ్చింది. దీంతో ఒక టీంను అక్కడికి పంపించాం. అయితే తలుపు తాళం వేసి ఉంది. తాళం పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి సెర్చ్ చేశాం. ట్రంక్లో చిన్నారి డెడ్బాడీ దొరికింది’’ అని హాపూర్ ఎస్పీ సర్వేశ్ కుమార్ మిశ్రా తెలిపారు. చిన్నారిపై అత్యాచారం జరిగిందా లేదా అనేది పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక తెలుస్తుందన్నారు. ఆ ఏరియాలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించిన తరువాత పక్కింటి వ్యక్తి చిన్నారిని బైక్పై ఎక్కించుకుని తీసుకెళ్లినట్టు, తర్వాత తన ఇంట్లోకి తీసుకెళ్లినట్టు తెలిసిందని చిన్నారి తండ్రి చెప్పాడు. ఇక, అరెస్టు చేసి తీసుకెళుతున్న సమయంలో నిందితుడిపై స్థానికులు దాడి చేశారు.