
ముంబై: ఒక పక్క బెంచ్మార్క్ ఇండెక్స్లు నిఫ్టీ, సెన్సెక్స్ గురువారం నష్టపోతే, బ్రాడ్ మార్కెట్ ఇండెక్స్లు బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ మాత్రం కొత్త గరిష్టాలను టచ్ చేశాయి. దీంతో బీఎస్ఈలోని మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రికార్డ్ గరిష్టమైన రూ.292 లక్షల కోట్లను టచ్ చేసింది. సెషన్ ముగిసేనాటికి ఈ మార్కెట్ క్యాప్ రూ.290.7 లక్షల కోట్లుగా ఉంది. కిందటేడాది డిసెంబర్లో సెన్సెక్స్ తన ఆల్టైమ్ హై 63,583 ని టచ్ చేసిన విషయం తెలిసిందే.
ఆ టైమ్లో బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ.291.25 లక్షల కోట్లుగా రికార్డయ్యింది. సెన్సెక్స్ గురువారం సెషన్లో 311 పాయింట్లు (0.49 శాతం) తగ్గి 62,918 వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 68 పాయింట్లు పడి 18,688 వద్ద సెటిలయ్యింది. మరోవైపు బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ ఇంట్రాడేలో 28,215 వద్ద ఆల్ టైమ్ గరిష్టాన్ని టచ్ చేసింది. 28,132 వద్ద ముగిసింది. స్మాల్క్యాప్ ఇండెక్స్ కూడా ఇంట్రాడేలో 32,190 వద్ద ఆల్టైమ్ గరిష్టాన్ని తాకింది. 32,050 వద్ద క్లోజయ్యింది.
ముంచిన ఐటీ, బ్యాంక్లు..
ఫెడ్ వడ్డీ రేట్లను తాజా పాలసీ మీటింగ్లో పెంచనప్పటికీ, ఈ ఏడాదిలోపు మరో రెండు సార్లు రేట్ల పెంపు ఉంటుందనే సంకేతాలను ఇచ్చింది. దీంతో గ్లోబల్ మార్కెట్లతో పాటే ఇండియన్ మార్కెట్లు కూడా గురువారం నష్టపోయాయి. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి బ్యాంక్ షేర్లు, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, విప్రో వంటి ఐటీ షేర్లు బెంచ్మార్క్ ఇండెక్స్లను కిందకి లాగాయి. సెక్టార్ల పరంగా చూస్తే, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ, మీడియా, రియల్టీ సెక్టార్ల ఇండెక్స్లు 2 శాతం వరకు నష్టపోయాయి. గ్లోబల్గా చూస్తే జపాన్, టోక్యో మార్కెట్లు నష్టపోయాయి. హాంకాంగ్, షాంఘై మార్కెట్లు పెరిగాయి. యూరోపియన్ మార్కెట్లు నష్టాల్లో కదిలాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 13 పైసలు తగ్గి 82.18 వద్ద సెటిలయ్యింది.
ఎక్స్పర్ట్లు ఏమంటున్నారంటే?
ఫెడ్ మార్కెట్లను సర్ప్రైజ్ చేసిందని, ఈ ఏడాది మరో రెండు సార్లు రేట్ల పెంపు ఉంటుందనే సంకేతాలను ఇచ్చిందని కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ సీఐఓ దీపక్ అగర్వాల్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఒకసారే రేట్ల పెంపు ఉంటుందని మార్కెట్ అంచనావేస్తోందని చెప్పారు. ఫెడ్ జులై మీటింగ్లో వడ్డీ రేట్లను చివరిసారిగా పెంచి 5.25–5.50 శాతానికి చేర్చుతుందని, ఈ ఏడాది మొత్తం రేట్లను పెంచదని అంచనావేస్తున్నామని దీపక్ అగర్వాల్ పేర్కొన్నారు.
కోర్ ఇన్ఫ్లేషన్ మరింత దిగువకు వస్తుందనే అంచనాలతో ఈ లెక్కలు వేశామన్నారు. ఈ ఏడాది చివరి నాటికి మళ్లీ రేట్ల పెంపు ఉంటుందన్న ఫెడ్ చైర్మన్ కామెంట్స్తో మార్కెట్ పడిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ అన్నారు. ఈ ఏడాది చివరి నాటికి కీలక వడ్డీ రేటు 5.6 శాతానికి, వచ్చే ఏడాది చివరి నాటికి 4.6 శాతానికి చేరుతుందని ఫెడ్ అంచనా వేస్తోందన్నారు. కాగా, వడ్డీ రేట్లు ఎక్కువ కాలం పాటు గరిష్ట లెవెల్స్లో ఉంటే ఎకానమీ గ్రోత్కు ఇబ్బంది ఉంటుంది. ఈ ప్రభావం గ్లోబల్ మార్కెట్లపై పడుతుంది. ‘పెద్ద దేశాల్లో ఇండియా మంచి పొజిషన్లో ఉంది. గ్రోత్– ఇన్ఫ్లేషన్ను మంచిగా బ్యాలెన్స్ చేస్తోంది.
మన దేశంలో గ్రోత్ పెరుగుతోంది. ఇన్ఫ్లేషన్ దిగొస్తోంది. సైక్లికల్ షేర్లు మంచి పెర్ఫార్మెన్స్ చేస్తాయి. ఇన్వెస్టర్లు ఫైనాన్షియల్, ఆటోమొబైల్స్, క్యాపిటల్ గూడ్స్, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సెగ్మెంట్లపై ఫోకస్ పెట్టాలి’ అని విజయకుమార్ వెల్లడించారు. టెక్నికల్గా చూస్తే నిఫ్టీ బేరిష్గా కనిపిస్తోందని, ఈ ఇండెక్స్ రానున్న సెషన్లలో18,550 లెవెల్కు పడిపోవచ్చని ఎల్కేపీ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ రూపక్ దే అన్నారు. పైన 18,750 లెవెల్ రెసిస్టెన్స్గా పనిచేస్తుందని చెప్పారు.
మల్టీ బ్యాగర్ షేర్లు..
పేటీఎం: పేటీఎం (వన్97 కమ్యూనికేషన్స్) షేర్లు గురువారం సెషన్ ఇంట్రాడేలో ఐదు శాతం ర్యాలీ చేసి రూ.898.30 వద్ద ఏడాది గరిష్టాన్ని టచ్ చేశాయి. చివరికి 4.23 శాతం లాభంతో రూ.892.90 వద్ద ముగిశాయి. కిందటేడాది నవంబర్ 24 న కంపెనీ షేర్లు రూ.439.60 వద్ద ఏడాది కనిష్టాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ లెవెల్ నుంచి పెరుగుతూనే ఉన్నాయి. కేవలం ఏడు నెలల్లోనే పేటీఎం షేర్లు104 శాతం రిటర్న్ ఇచ్చి మల్టీబ్యాగర్ షేర్లుగా మారాయి. ఈ షేరు రూ.1,000 లెవెల్ను ఈజీగా దాటుతుందని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. కాగా, కంపెనీ షేర్లు ఇష్యూ ధర రూ.2,100 తో పోలిస్తే చాలా తక్కువకు ట్రేడవుతోంది.
జొమాటో: జొమాటో షేర్లు తమ ఐపీఓ ఇష్యూ ధర రూ.76 ను తాజాగా దాటాయి. రూ.40.60 వరకు పడిపోయిన కంపెనీ షేర్లు తాజాగా రూ.80.30 వద్ద ఏడాది గరిష్టాన్ని టచ్ చేసింది. ఇది 100 శాతం రిటర్న్కు సమానం. గురువారం సెషన్లో రూ.74.95 వద్ద కంపెనీ షేర్లు సెటిలయ్యాయి. కంపెనీ సబ్సిడరీ బ్లింకిట్ రెవెన్యూ పెరగడం, జొమాటో నష్టాలు తగ్గడంతో పాటు, మేనేజ్మెంట్లోకి సీనియర్లను తీసుకోవడం వంటి అంశాలు కంపెనీ షేర్లు పెరగడానికి కారణమయ్యాయి.