- గోపీచంద్ వల్లనే ఈ స్థాయికి వచ్చా: స్టార్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్
హైదరాబాద్, వెలుగు: బ్యాడ్మింటన్ డబుల్స్లో తెలుగు కుర్రాడు సాత్విక్ సాయిరాజ్ ఓ రేంజ్లో దూసుకెళ్తున్నాడు. చిరాగ్ షెట్టితో కలిసి ఆసియా గేమ్స్ మెన్స్ డబుల్స్లో గోల్డ్, మెన్స్ టీమ్ ఈవెంట్లో సిల్వర్ గెలిచి వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్ కూడా అందుకున్నారు. ఆసియా గేమ్స్ ముగించుకుని హైదరాబాద్ తిరిగొచ్చిన సాత్విక్, బ్రాంజ్ మెడలిస్ట్ హెచ్ఎస్ ప్రణయ్కు బుధవారం గోపీచంద్ అకాడమీలో ఘన స్వాగతం లభించింది.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సాత్విక్.. కొంతకాలం కిందట తమను ఎవ్వరూ పట్టించుకునే వాళ్లు కాదని, ఇప్పుడు మాత్రం ప్రపంచంలోని డబుల్స్ ఆటగాళ్ల దృష్టంతా తమపైనే ఉందని చెప్పాడు. మంగళవారం ఆసియా మెడల్ విన్నర్లందరితో కలిసి ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసిన విషయాలను పంచుకున్నాడు. ‘అథ్లెట్లందరికీ ప్రధాని మోదీ స్ఫూర్తిదాయకం. మొన్న ఆయన పక్కన కూర్చోవడం గొప్ప అనుభూతినిచ్చింది.
అమలాపురంలో పుట్టి స్కూల్లో ఎప్పుడూ బ్యాక్ బెంచీలోనే కూర్చునే నాకు ఓ గొప్ప వ్యక్తి పక్కన కూర్చునే అదృష్టం దక్కింది. ఇదంతా గోపీ సర్ వల్లనే. ఆయన లేకుండా నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు’ అని సాత్విక్ చెప్పుకొచ్చాడు.
మ్యాచ్ గెలిచినప్పుడల్లా చిరాగ్తో కలిసి కోర్టులో స్టెప్పులు వేసే సాత్విక్ తనకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని, తన విజయాలను దానితోనే సెలబ్రేట్ చేసుకుంటున్నానని తెలిపాడు. ఇప్పుడు తమ ముందు అతి పెద్ద టార్గెట్ (ఒలింపిక్స్) ఉందన్నాడు. అది గెలిచిన తర్వాత తాను ఎంత పెద్ద డ్యాన్సర్నో అందరూ చూస్తారన్నాడు.