కోచింగా.. నాతోని కాదు: సైనా నెహ్వాల్

కోచింగా.. నాతోని కాదు: సైనా నెహ్వాల్

హైదరాబాద్‌, వెలుగు: బ్యాడ్మింటన్‌ ప్లేయర్లుగా ఓ వెలుగు వెలిగిన పుల్లెల గోపీచంద్‌, గుత్తా జ్వాలతో పాటు తాజాగా పారుపల్లి కశ్యప్‌, గురుసాయి దత్‌ కోచ్‌లుగా మారారు. తన ఆటతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ మాత్రం కోచింగ్‌పై తనకు ఇంట్రస్ట్‌ లేదని అంటోంది. సౌతిండియాలో ప్రముఖ బ్యాడ్మింటన్‌ కోచింగ్‌ అకాడమీ ‘బ్యాడ్మింటన్‌ ప్రోస్‌’కు తన భర్త కశ్యప్​, గురుసాయితో కలిసి సైనా మెంటార్‌గా ఎంపికైంది. 

ఈ విషయాన్ని  బుధవారం హైదరాబాద్‌లో జరిగిన  మీడియా సమావేశంలో ఆర్గనైజర్స్‌ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన సైనా ‘కోచింగ్‌ నా వల్ల కాదు. నాకు కొంచెం మొహమాటం. ఎదుటివాళ్లతో ఎక్కువ మాట్లాడలేను. కోచింగ్‌ ఇవ్వాలంటే చాలా కష్టపడాలి. ప్లేయర్ల వెంట పరుగెత్తాలి. అది నా వల్ల కాదు. కశ్యప్‌, గురుసాయి అయితే ఆ పని బాగా చేస్తారు. 

నా వరకు  సలహాలు, సూచనలు ఇస్తా. ఫ్యూచర్‌లో నా మైండ్‌ ఛేంజ్‌ అవుతుందేమో చెప్పలేను గానీ ప్రస్తుతానికైతే నాకు కోచింగ్‌పై ఇంట్రస్ట్‌ లేదు’ అని  చెప్పుకొచ్చింది. తాను పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాకే తిరిగి కోర్టులోకి అడుగు పెడతానని సైనా  వెల్లడించింది.