తన రెండో సినిమాపై క్లారిటీ ఇచ్చిన ‘బలగం’ వేణు

తన రెండో సినిమాపై క్లారిటీ ఇచ్చిన ‘బలగం’ వేణు

చిన్న సినిమాగా విడుదలై ఊహించని విజయాన్ని అందుకుంది ‘బలగం’. ఈ సినిమా చూసి కంట తడి పెట్టని వారు ఉండడేమో. అంతలా ప్రేక్షకులను కట్టిపడేసింది.  ఇంత భారీ హిట్ తర్వాత దర్శకుడు వేణు తర్వాత సినిమా ఎలా ఉండబోతోంది అనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఇటీవల ఈ విషయంపై వేణు స్పందించాడు. తన రెండో సినిమా కచ్చితంగా దిల్ రాజు బ్యానర్ లోనే ఉంటుందని స్పష్టం చేశాడు. మరి ఈ సారి ఎలాంటి కాన్సెప్ట్ తో రాబోతున్నాడు అనే విషయాలపై తాజాగా మాట్లాడాడు. 

‘‘నిజానికి  రెండో సినిమా అంటే నాకూ టెన్షన్ గానే ఉంది. మొదటి సినిమా విజయం  నాపై ఉంచిన బాధ్యత అలాంటిది. 2007 లో ‘మున్నా’ సినిమాతో నాకు గుర్తింపునిచ్చింది దిల్ రాజు గారే. మళ్లీ ఆయన వల్లే జబర్దస్త్ వేణుగా ఉన్న నాకు బలగం ఇంటి పేరుగా మారింది. కచ్చితంగా రెండో సినిమా ఆయనతోనే తీస్తాను. ఇప్పటికే ఆయనకు ఒక కథ వినిపించాను. దానికి ఆయన ఇచ్చిన సూచనలు కొత్త కిక్ ను ఇచ్చాయి. త్వరలోనే దానిపై పనిచేస్తాను.  ప్రస్తుతం బలగం సక్సెస్ ను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నాను. అటు నటుడిగా వచ్చిన అవకాశాలను ఏమాత్రం వదులుకోను’’ అంటూ వేణు వివరించాడు.