సెంటిమెంట్ నుంచి ప్రెస్టీజ్ ఇష్యూగా.. బాలాపూర్ లడ్డు చరిత్ర ఇదే

సెంటిమెంట్ నుంచి  ప్రెస్టీజ్ ఇష్యూగా..   బాలాపూర్ లడ్డు చరిత్ర ఇదే

ఆది దంపతుల అపురూప పుత్రుడు వినాయకుడంటే అందరికీ ఇష్టమే. ఆయన ప్రసాదం అంటే భక్తులందరికీ పరమ పవిత్రమే. లడ్డూ వేలం పాట అంటే.. అందరికీ గుర్తుకొచ్చేది.. బాలాపూర్ లడ్డు గురించే. ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బాలాపూర్ లడ్డూ వేలంపై యావత్ తెలుగు ప్రజల ఫోకస్ ఉంటుంది.

బాలాపూర్ వినాయకుడికి 43 ఏళ్ల చరిత్ర ఉన్నా..లడ్డూ వేలం మాత్రం 1994 నుంచి కొనసాగుతూ వస్తోంది. ఆ ఏడాది బాలాపూర్ కు చెందిన కొలను మోహన్ రెడ్డి కేవలం 450 రూపాయలకు వేలం పాట ద్వారా లడ్డూను దక్కించుకున్నారు. ఆ తర్వాత 1995లో 4 వేల 500 లకు మళ్లీ ఆయనే అందుకున్నారు. ఆ తర్వాత కొలను కృష్ణారెడ్డి 1996 లో 18 వేలకు, 1997 లో 28 వేలకు లడ్డూను వేలంలో దక్కించుకున్నారు. 1998 లో మళ్లీ కొలను మోహన్ రెడ్డి 51 వేలకు వేలం పాట పాడారు. 1999లో కల్లెం ప్రతాప్ రెడ్డి 65 వేలకు దక్కించుకున్నారు. 2000లో కల్లెం అంజిరెడ్డి 66వేలకు, 2001లో రఘునందన్ చారి 85వేలకు వేలం పాట జరగగా.. 2002లో తొలిసారి వేలం పాట లక్ష దాటింది. కందాడ మాధవరెడ్డి లక్షా 5 వేలకు లడ్డూను అందుకున్నారు.

2003లో చిగురంత తిరుపతిరెడ్డి లక్షా 55 వేలకు, 2004లో మరోసారి కొలను మోహన్ రెడ్డి 2 లక్షల ఒక వేయికి లడ్డూను అందుకున్నారు. 2005లో ఇబ్రహీం శేఖర్ 2 లక్షల 8 వేలకు, 2006లో చిగురంత తిరుపతి రెడ్డి 3 లక్షలకు, 2007లో జి.రఘునందన్ చారి 4 లక్షల 15 వేలకు, 2008లో కొలను మోహన్ రెడ్డి 5 లక్షల 7 వేలకు, 2009లో సరిత 5 లక్షల 10 వేలకు లడ్డును వేలంపాటలో దక్కించుకొన్నారు. 2010లో కొడాలి శ్రీధర్ బాబు 5 లక్షల 35 వేలకు, 2011లో కొలను బ్రదర్స్ 5 లక్షల 45 వేలకు లడ్డును సొంతం చేసుకున్నారు. 2012లో పన్నాల గోవర్థన్ ఏడున్నర లక్షలకు దక్కించుకోగా.. 2013లో మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి 9 లక్షల 26 వేలకు, 2014లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి తొమ్మిదిన్నర లక్షలకు లడ్డును దక్కించుకొన్నారు.

ఇక 2015లో లడ్డూ ధర తొలిసారి 10 లక్షల దాటింది. కళ్లెం మదన్ మోహాన్ రెడ్డి 10 లక్షల 32 వేలకు వేలంలో లడ్డూపు సొంతం చేసుకున్నారు. 2016లో స్కైలాబ్ రెడ్డి 14 లక్షల 65 వేలకు, 2017లో నాగం తిరుపతి రెడ్డి వేలంలో 15 లక్షల 60 వేలకు దక్కించుకున్నారు. 2018లో శ్రీనివాస్  గుప్తా 16 లక్షల 60 వేలకు దక్కించుకున్నారు. 2019లో కొలను రాంరెడ్డి 17 లక్షల 60 వేలకు లడ్డూను దక్కించుకున్నారు.

కరోనా కారణంగా.. 2020 లో బాలాపూర్ లడ్డూకు వేలం పాట నిర్వహించలేదు. 2021 నాదర్ గుల్ కు చెందిన మర్రి శశాంక్  రెడ్డి, ఏపీ ప్రొద్దుటూరుకు చెందిన  ఎమ్మెల్సీ రమేష్  యాదవ్ లు కలిసి.. 18 లక్షల 90 వేలకు ల డ్డూను దక్కించుకున్నారు. అయితే 2022లో వంగేటి లక్షారెడ్డి 24 లక్షల 60 వేలకు దక్కించుకున్నారు. లడ్డూ చరిత్రలో కొలను కుటుంబం వారే.. 9 సార్లు సొంతం చేసుకున్నారు. 

అయితే ఇన్ని లక్షలు పెట్టి లడ్డూను దక్కించుకున్న వారికి రకరకాల ప్రయోజనాలు కలుగుతాయనే నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. మొదట భక్తిగా.. తర్వాత సెంటిమెంట్ గా.. ఆ తర్వాత ప్రెస్టీజ్ ఇష్యూగా మారిపోయింది.. బాలాపూర్ లడ్డూ వేలం వ్యవహారం. రాష్ట్రవ్యాప్తంగా గణేష్ లడ్డూలకి ఎక్కడా లేని వాల్యూ తీసుకొచ్చింది.. బాలాపూర్ లడ్డూ వేలం పాటే. ఈ లడ్డూను సొంతం చేసుకున్నవారి పాప్యులారిటీ.. అమాంతం పెరిగిపోతుంది.

లడ్డును దక్కించుకునేందుకు బాలాపూర్ గ్రామస్థులే కాదు.. ఇతర ప్రాంతాల వారూ వేలంలో పాల్గొనేందుకు బాలాపూర్  వస్తారు. వేలంలో లడ్డును సొంతం చేసుకున్న వారు స్థానికులైతే.. ఆ మొత్తాన్ని మరుసటి ఏడాది చెల్లించాల్సిన వెసులుబాటు ఉండగా.. ఇతరులైతే మాత్రం.. గణేశ్  ఉత్సవ కమిటీకి.. అక్కడికక్కడే ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది