- మూడున్నర నెలల్లో రూ.కోటి వసూలు
- చందానగర్,శేరిలింగంపల్లిలో అధికం
- కొనసాగుతున్న జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్
‘స్వచ్ఛ’ రూల్స్ పాటించని 8,500 మంది వ్యక్తులు, సంస్థల నుంచి బల్దియా కోటి రూపాయల ఫైన్ వసూలు చేసింది. మూడున్నర నెలల్లో చందానగర్, శేరిలింగంపల్లి సర్కిళ్లలో ఎక్కువ మొత్తంలో ఉల్లంఘనలు జరిగాయి. ప్రజలు, వ్యాపార సంస్థలు పరిసరాల శుభ్రతపై బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు కోరుతున్నారు..
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ లో స్వచ్ఛతకు భంగం కలిగిస్తూ బాధ్యతారహితంగా వ్యవహరించే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్న జీహెచ్ఎంసీ భారీగా జరిమానానాలు విధిస్తోంది. మే 24న చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా జీహెచ్ఎంసీ మూడున్నర నెలల్లో 8,500కు పైగా వ్యక్తులు, సంస్థలకు కోటి రూపాయల జరిమానాలు విధించారు. రోడ్లపై భవన నిర్మాణ వ్యర్థాలు, చెత్త పడేయడం, చెత్త తగలబెట్టడం, నాలాలో వ్యర్థాలు వేయడం, బహిరంగ మల, మూత్ర విసర్జన వంటి స్వచ్ఛ ఉల్లంఘనలకు జరిమానా విధిస్తున్నారు. తడి, పొడి చెత్త సేకరణకు ప్రత్యేక చర్యలు చేపట్టినా ప్రజల్లో ఆశించిన స్థాయి చైతన్యం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఫైన్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
చందానగర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు టాప్
మే 24వ తేదీ నుండి చేపట్టిన ఈ డ్రైవ్లో చందానగర్ సర్కిల్లో అత్యధికంగా 518 జరిమానాల ద్వారా రూ.16,90,300 వసూలు చేసింది. శేరిలింగంపల్లి సర్కిల్ లో 312 జరిమానాల ద్వారా రూ.13,90,200, ఖైరతాబాద్ సర్కిల్ లో 627 జరిమానాల ద్వారా రూ.8,41,400, జూబ్లీహిల్స్ సర్కిల్ లో 462 జరిమానాల ద్వారా రూ.6,85,800, మూసాపేట్ సర్కిల్ లో 350 జరిమానాల ద్వారా రూ. 5,15,150, ఉప్పల్ సర్కిల్ లో 417 జరిమానాల ద్వారా రూ. 4,53,670, ముషీరాబాద్ సర్కిల్ లో 402 జరిమానాల ద్వారా రూ.4,31,900, బేగంపేట్ సర్కిల్ లో 323 జరిమానాల ద్వారా రూ.3,08,200 వసూలు చేశారు. అతితక్కువగా ఆర్సీ పురం సర్కిల్లో 45 జరిమానాల ద్వారా రూ. 60,400, గాజుల రామారం సర్కిల్లో 84 జరిమానాల ద్వారా రూ.74,990 విధించారు.