
రెండు నెలల క్రితం తప్పిపోయిన బలూచిస్తాన్ టైమ్స్ ఎడిటర్-ఇన్-చీఫ్ సాజిద్ హుస్సేన్ శవమై తేలాడు. ఆయన స్వీడిష్ పట్టణంలో చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. ఉప్ప్సలాలోని ఒక నదిలో సాజిద్ మృతదేహాన్ని కనుగొన్నట్లు స్వీడన్ పోలీసులు గురువారం రాత్రి అతని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ ఏడాది మార్చి 2 నుంచి సాజిద్ కనిపించకుండా పోయాడు.
సాజిద్ 2012లో పాకిస్తాన్ నుంచి బయటకు వచ్చి బతుకుతున్నాడు. ఆ తర్వాత 2017 నుండి స్వీడన్లో శరణార్థిగా నివసిస్తున్నాడు. పాకిస్తాన్ సైనికుల వల్ల బలూచీలు పడుతున్న బాధల గురించి సాజిద్ విస్తృత కథనాలు రాశారు. అయితే ఆ కథనాలు పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా ఉండటంతో అతన్ని తరచూ ఇబ్బందులకు గురిచేసేవారు. ఆ ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికే సాజిద్ పాకిస్తాన్ నుంచి స్వీడన్ కు వలస వచ్చాడు.
‘పాకిస్తాన్ ఆర్మీ మరియు దాని ఇంటెలిజెన్స్ సర్వీస్ అయిన ఐఎస్ఐ నుండి బెదిరింపుల కారణంగానే సాజిద్ పాకిస్తాన్ నుంచి స్వీడన్ వెళ్లాడు. అక్కడ రెండు నెలల క్రితం తప్పిపోయిన ఆయన.. ఇప్పుడు ఒక నదిలో శవమై తేలాడు. ప్రముఖ బలూచ్ మేధావి మరియు రచయిత సాజిద్ హుస్సేన్ మరణంతో మేము చాలా బాధపడుతున్నాం. సాజిద్ మరణం బలూచిస్తాన్ ప్రజలకు తీరనిలోటు. అతని ముక్కుసూటితనమే అతన్ని ప్రేమించేలా చేశాయి. అందుకే పాత్రికేయ, సాహిత్య మరియు రాజకీయ వర్గాలు అతన్ని ఎక్కువగా ఇష్టపడ్డాయి. ఈ సంఘటన తరువాత.. ఇతర దేశాలలో నివసిస్తున్న బలూచ్ శరణార్థుల గురించి మాకు ఆందోళన ఎక్కువైంది’ అని బలూచ్ నేషనల్ మూవ్మెంట్ ప్రతినిధి, హమ్మల్ హైదర్ అన్నారు.
For More News..