
- నిల్వ చేసినా, విక్రయించినా కఠిన చర్యలు
- రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. పొగాకు, నికోటిన్ కలిగిన గుట్కా, పాన్ మసాలా తయారీ, నిల్వ, సరఫరా, రవాణా, అమ్మకంపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.
ఏడాదిపాటు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని చెప్పారు. నిబంధనలు అతిక్రమించి గుట్కా తయారు చేసినా, నిల్వ ఉంచినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓ వైపు రాష్ట్రంలోని పలు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అపరిశుభ్రత, నిల్వ ఉంచిన ఆహారం గుర్తించి ఆయా హోటళ్ల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటున్నారు.