సిద్దిపేటలో ఇరువర్గాల ఘర్షణ..ఓ ఇంట్లో ఆవులను ఎందుకు కట్టేశారని అడగడంతో మొదలైన గొడవ

సిద్దిపేటలో ఇరువర్గాల ఘర్షణ..ఓ ఇంట్లో ఆవులను ఎందుకు కట్టేశారని అడగడంతో మొదలైన గొడవ
  • వీహెచ్‌‌పీ జిల్లా కార్యదర్శి గ్యాదరి రాజారాంకు గాయాలు
  • ప్రశాంతంగా ముగిసిన సిద్దిపేట పట్టణ బంద్‌‌

సిద్దిపేట రూరల్, వెలుగు :ఆవులను ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ సిద్దిపేట పట్టణంలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సిద్దిపేట టూటౌన్‌‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేటలోని అంబేద్కర్‌‌నగర్‌‌కు చెందిన వీహెచ్‌‌పీ జిల్లా కార్యదర్శి గ్యాదరి రాజారాం, గోరక్షక విభాగం సభ్యులు మురళి, అశోక్, సాయి ప్రణయ్‌‌తో పాటు పలువురు శనివారం రాత్రి సాజిద్‌‌పుర కాలనీ నుంచి వెళ్తున్నారు.

ఈ క్రమంలో ఓ ఇంట్లో ఆవులు కనిపించడంతో వాటిని ఎందుకు తీసుకొచ్చారని అదే కాలనీకి చెందిన కొందరిని ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య గొడవ మొదలైంది. ఈ క్రమంలో సుమారు 20 మంది రాజారాంను కులం పేరుతో తిట్టడమే కాకుండా కత్తితో పొడిచారు. ఈ మేరకు రాజారాం తమ్ముడు గిరి ఫిర్యాదుతో ఆరుగురిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు టూటౌన్‌‌ సీఐ తెలిపారు. మరో వైపు రాజారాం తదితరులు తమ ఇంటిపై దాడి చేసి, రాళ్లు విసిరారని బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని చెప్పారు.

సిద్దిపేట బంద్ ప్రశాంతం

గ్యాదరి రాజారాంపై దాడిని నిరసిస్తూ వీహెచ్‌‌పీ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన సిద్దిపేట బంద్‌‌ ప్రశాంతంగా ముగిసింది. వీహెచ్‌‌పీ కార్యకర్తలు బైక్‌‌లపై తిరుగుతూ వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసివేయించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌‌ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్త్‌‌ ఏర్పాటు చేశారు. 

రాజారాంను పరామర్శించిన ఎంపీ రఘునందన్‌‌రావు

సిద్దిపేట టౌన్‌‌, వెలుగు : దాడిలో గాయపడి సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్‌‌లో ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటున్న గ్యాదరి రాజారాంను సోమవారం ఎంపీ రఘునందన్‌‌రావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోరక్షణ సభ్యులపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేసినా పోలీసులు ఒక వర్గానికే వత్తాసు పలకడం సరికాదన్నారు. బక్రీద్‌‌ టైంలో అలజడులు సృష్టించడం కొందరికి ఆనవాయితీగా మారిందన్నారు. రాజారాంకు భద్రత కల్పించడంతో పాటు, లా అండ్‌‌ ఆర్డర్‌‌కు భంగం వాటిల్లకుండా పోలీసులు పికెటింగ్‌‌లు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే విశ్వహిందూ పరిషత్‌‌ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్‌‌ సైతం రాజారాంను పరామర్శించారు.