
కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ కు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సాదర స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర మంత్రి అమిత్ షా బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమిత్ షా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమ్మవారిని అమిత్ షా దర్శించుకున్న తర్వాత కళాసిగూడలోని బీజేపీ కార్యకర్త సత్యనారాయణ ఇంటికి వెళ్లి కాఫీ తాగనున్నారు. 30నిమిషాల పాటు అక్కడ గడపనున్నారు. అక్కడి నుంచి బేగంపేటలోని రామ్ మనోహర హోటల్ కు చేరుకొని రైతు సంఘాల నేతలతో సమావేశం కానున్నారు. అనంతరం సాయంత్రం 4.10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో మునుగోడుకు బయలుదేరుతారు.