
- తుపాకులు పట్టుకొని తిరుగుతున్నవారితో చర్చలు ఎలా జరుపుతారు?: బండి సంజయ్
- మావోయిస్టులు అడవులను వదిలి జనజీవన స్రవంతిలో కలవాలి
- వరవరరావు, హరగోపాల్ ఏంసాధించారో చెప్పాలని కామెంట్
గోదావరిఖని, వెలుగు: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో మావోయిస్టులపై ఉన్న నిషేధాన్ని ఎందుకు ఎత్తివేయలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ప్రశ్నించారు. ఇప్పుడు ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను కేంద్రం అణచివేస్తున్నదంటూ వారిమీద అమితమైన ప్రేమ నటిస్తున్నారని విమర్శించారు. అడవుల్లో తుపాకులు పట్టుకొని తిరుగుతున్న వారితో చర్చలు ఎలా జరుపుతారని ఆయన ప్రశ్నించారు.
మావోయిస్టులు అడవులను వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన పిలుపునిచ్చారు. రామగుండం ఎన్టీపీసీ జ్యోతిభవన్లో సోమవారం సంజయ్మీడియాతో మాట్లాడారు. గతంలో ఎంతోమంది రాజకీయ నాయకులను, అమాయక ప్రజలను మావోయిస్టులు పొట్టన పెట్టుకున్నారన్నారు. తుపాకులు చేత పట్టి సాధించింది ఏమీ లేదని, ఆ తుపాకులే వారిని బలిగొంటాయని సంజయ్ అన్నారు. మావోయిస్టుల సానుభూతిపరులైన హరగోపాల్, వరవర రావు ఇప్పటివరకు ఏం సాధించారో చెప్పాలన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో టూరిస్టులను టెర్రరిస్టులు కాల్చి చంపితే.. ఇక్కడ అమాయక ప్రజలను మావోయిస్టులు చంపేస్తున్నారని పేర్కొన్నారు. మావోయిస్టులతో ఎట్టి పరిస్థితుల్లో చర్చలు జరిపేది లేదని, తుపాకులను వదిలి లొంగిపోవాలని సూచించారు. జాతీయ జెండాను ఎగురవేసిన వారిని గౌరవిస్తామని, నల్ల జెండాలను ఎగురవేస్తే సహించమని హెచ్చరించారు.
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైందని, ప్రజల్లోకి వెళితే ప్రశ్నిస్తారనే భయంతో రోజుకొక కొత్త డ్రామాకు తెరలేపుతున్నారని సంజయ్ ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన విషయంలో సర్వే మాత్రమే చేసిందని, బీజేపీ మాత్రం కులగణన చేపడుతుందన్నారు. కులగణన ద్వారా బీసీలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ప్రజల ప్రయాణ సౌకర్యం కోసం ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ రహదారుల నిర్మాణానికి పెద్ద పీటవేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే మరిన్ని కొత్త జాతీయ రహదారులను నిర్మిస్తామని చెప్పారు. అంతకుముందు మంత్రి బండి సంజయ్కి పార్టీ నేతలతో పాటు ఎన్టీపీసీ అధికారులు స్వాగతం పలికి శాలువాలతోసన్మానించారు.