రాష్ట్రంలో ఉపాధ్యాయుల దుస్థితి తలచుకుంటే గుండె తరుక్కుపోతుంది

రాష్ట్రంలో ఉపాధ్యాయుల దుస్థితి తలచుకుంటే గుండె తరుక్కుపోతుంది

హైదరాబాద్: అసమర్థ టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాకం వల్ల తెలంగాణలో ఉపాధ్యాయుల దుస్థితి తలచుకుంటే గుండె తరుక్కుపోతుందన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. శనివారం టీచర్స్ డే సందర్భంగా మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న దుస్థితి గురించి చెప్పుకొచ్చారు. ప్రీపైమరీ స్కూల్ టీచర్ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్ వరకు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాళ్లు.. ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులు అన్న తేడా లేకుండా అనేక కష్టాలకు గురవుతున్నారన్నారు. కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న తరుణంలో వైరస్ ను కట్టడి చేసేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో స్కూళ్లు, కాలేజీలు సహా విద్యాసంస్థలను బంద్ పెట్టాల్సి వచ్చిందని.. స్కూళ్లు, కాలేజీల్లో తరగతులు నడవడం లేదని ప్రైవేటు యాజమాన్యాలు టీచర్లు, లెక్చరర్లకు జీతాలు సగానికి పైగా కోత పెడుతున్నాయన్నారు.

కొన్ని సంస్థలయితే అసలు మొత్తానికే జీతాలు ఇవ్వడం లేదు. చేతిలో చిల్లిగవ్వ లేక, రోజు గడవడమే గగనంగా మారి రాష్ట్రంలో టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నవాళ్లు, వారి కుటుంబీకులు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావన్నారు. ఎన్నికల వేళ టీచర్లకు అది చేస్తాం.. ఇది చేస్తాం అని వరాలు గుప్పించే సీఎం కేసీఆర్ ఈ కష్టకాలంలో వారిని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. జీతాలు రాక, చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీచర్లను, లెక్చరర్లను ఆదుకోవాలన్న సోయి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేకపోయిందని తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రైమరీ స్కూల్ టీచర్ నుంచి యూనివర్సిటీ ప్రొఫెసర్ల వరకు బోధన సిబ్బందిలో అనేక ఖాళీలు ఉన్నాయని… వీటిని భర్తీ చేయకపోవడంతో ఉన్న సిబ్బందిపైనే విపరీతమైన భారం నెడుతున్నారన్నారు. నియామకాలు చేపట్టాల్సిందిగా యువత, నిరుద్యోగులు గొంతు చించుకుంటుంటే చెవిటివాని ముందు శంఖం ఊదిన చందంగానే మారింది కానీ తోలుమందం రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదన్నారు. ఈ నియామకాలు చేపడితే యువతకు ఉద్యోగాలు దక్కడమే కాకుండా… రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు దోహదపడుతుందన్నారు. కానీ సీఎం కేసీఆర్ నియామకాల ఉసే ఎత్తొద్దంటూ భీష్మించుకు కూర్చున్నారని తెలిపారు. ‘గురు బ్రహ్మ గురు విష్ణు..’ అంటూ భారతీయ సనాతన ధర్మం గురువును దేవుని స్థానంలో నిలబెట్టిందన్నారు.

పూజ్యనీయ స్థానం అటుంచితే టీఆర్ఎస్ సర్కార్ అసమర్థత వల్ల టీచర్లు కనీసం మనుషులుగానూ జీవించలేకపోతున్నారని.. పూటగడవడానికే ఇబ్బందులనెదుర్కొంటూ దారుణంగా బతుకులు ఈడుస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వం మొండిపట్టుదల వీడి లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీచర్లకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలన్నారు. ఎన్నికల ముందు, అధికారంలోకి వచ్చాక టీచర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని.. టీచర్ల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు భారతీయ జనతా పార్టీ వారి పక్షాన పోరాడుతుందని, వారికి అండగా ఉంటుందని హామీ ఇస్తున్నానన్నారు బండి సంజయ్.