మిల్లర్ల అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయండి : రాష్ట్ర అధ్యక్షుడు పాడి గణపతిరెడ్డి

మిల్లర్ల అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయండి : రాష్ట్ర అధ్యక్షుడు పాడి గణపతిరెడ్డి
  •     వారంలో మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి 
  •     లేదంటే మిల్లులను మూసి ధర్నా చేస్తామని రా రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌‌ హెచ్చరిక 

హైదరాబాద్, వెలుగు: రైస్ మిల్లింగ్‌‌ వ్యవస్థలో జరిగే అవకతవకలపై సిట్టింగ్‌‌ జడ్జితో విచారణ జరిపించాలని రా రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌‌ డిమాండ్‌‌ చేసింది. బుధవారం హైదరాబాద్‌‌లోని హరిత ప్లాజాలో రా రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌‌ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పాడి గణపతిరెడ్డి మాట్లాడుతూ.. మిల్లర్లంతా చెడ్డవాళ్లు కాదని, కొంత మంది చేసే అక్రమాలను అందరికి ఆపాదించి ఇబ్బంది పెట్టొద్దని సీఎం రేవంత్‌‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డిని కోరారు. ఏండ్లు గడుస్తున్నా తమ సమస్యలు పరిష్కారం కావడంలేదని, ఇకనైనా సర్కారు తమ సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించాలని, లేదంటే ఆందోళన బాట తప్పదని స్పష్టం చేశారు. పాత బకాయిలు విడుదల చేయాలని, 25శాతం పెనాల్టీని రద్దు చేయాలి, 200హెచ్‌‌పీ విద్యుత్‌‌ను ఎల్‌‌టీ కేటగిరి కింద ఇప్పించాలి. డిఫాల్ట్ మిల్లర్లు బాకీ ఉన్న బియ్యంను నాలుగు విడతల్లో ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. 

వారం రోజుల్లో తమ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మిల్లులను మూసివేసి ధర్నాలు చేస్తామని స్పష్టం చేశారు. పతనావస్థకు చేరుకున్న రైస్​ మిల్లింగ్ వ్యవస్థను కాపాడాలని గణపతిరెడ్డి కోరారు. 2022-–23 రబీ టెండర్‌‌ ధాన్యానికి సంబంధించి మిల్లర్ల నుంచి రూ.2160 మాత్రమే వసూలు చేయాలనీ, ప్రస్తుతం వానకాలం సన్న ధాన్యం టెండర్‌‌ను రద్దు చేసి రబీ దొడ్డు ధాన్యాన్ని టెండర్‌‌ వేయాలన్నారు. 67శాతం సీఎమ్మాఆర్‌‌ రావడంలేదని, మరోసారి టెస్ట్ మిల్లింగ్‌‌ చేయించి దాని ప్రకారం సీఎమ్మాఆర్‌‌ తీసుకోవాలన్నారు. మిల్లర్ల బకాయిలు ఇప్పటికే రూ.4-5వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు.