
భయంకర హిందువు ఎక్కడ పొయ్యిండు?
అయ్యప్పపై కామెంట్లు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలి: సంజయ్
హైదరాబాద్, వెలుగు : అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసి కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిన బైరి నరేష్ ను వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆ వ్యక్తిని ఇప్పటిదాకా అరెస్ట్ చేయకపోవడం ప్రభుత్వ చేతకానితనమే అని విమర్శించారు. భయంకర హిందువునని చెప్పుకునే సీఎం ఎక్కడకు పోయారని కేసీఆర్ ను ఓ ప్రకటనలో సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్ర సర్కారు అడుగడుగునా హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని, హిందూ ధర్మాన్ని ఒకలా, వేరే మతాలను మరో రకంగా చూస్తున్నదని ఆయన ఫైరయ్యారు. అలాంటి వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం వల్లే రోజుకొకరు రెచ్చిపోయి హిందూ దేవుళ్లపై అభ్యంతరకర కామెంట్లు చేస్తున్నారని విమర్శించారు. సెక్యులరిజం పేరిట కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అలాంటి వాళ్లను ఉపేక్షిస్తూనే ఉన్నాయన్నారు. హిందువులంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని, లేకుంటే ఇంకా ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ పేరుతో నిర్వహించిన సభలో అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అంబేద్కర్ ను కూడా అవమానించడమే అవుతుందన్నారు.
నాస్తికులు దేవుడిని నమ్మకపోవడం వారి ఇష్టమని, కానీ, వేరే మతాలను కించపరిచే హక్కు ఎవరికీ లేదని ఆయన పేర్కొన్నారు. కులరహిత సమాజాన్ని అంబేద్కర్ కోరుకున్నారని, అయ్యప్ప మాలలో కులభేదాలు లేవని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రెసిడెంట్ కొప్పు బాష అన్నారు. అయ్యప్పపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నరేష్పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ కోరుకున్న సమాజం అయ్యప్ప భక్తుల రూపంలో ఉందని, నాస్తికులు వచ్చి దీక్ష చేస్తే ఆ విషయం తెలుస్తుందని ఆయన హితవు పలికారు.