
ఇందిరాపార్క్ వద్ద నిరసన చేస్తున్న వీఆర్ఏలపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఖండించారు. మహిళా వీఆర్ఏలను అరెస్ట్ చేసి అర్ధరాత్రి వరకు వివిధ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 79 రోజులుగా వీఆర్ఏలు సమ్మె చేస్తుంటే కనీసం స్పందించని కేసీఆర్ ప్రభుత్వం ఆడబిడ్డలను నిర్బంధించి తన నిరంకుశ విధానాన్ని చాటుకుందన్నారు. ఈ సమ్మె కాలంలో జరిగిన 50 మందికిపైగా వీఆర్ఏల మరణానికి టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.
అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన వీఆర్ఏలను పిలిపించుకుని 4 రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తానన్న మంత్రి కేటీఆర్ ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. దమ్ముంటే కేసీఆర్, మంత్రులు ఇందిరాపార్క్ వద్దకొచ్చి వీఆర్ఏలకు సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో పల్లె నుండి పట్నం దాకా ప్రతి చౌరస్తాలో బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపిన విషయాన్ని కేసీఆర్ కుటుంబం మరిచిపోయిందా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని వీఆర్ఏలు అడుగుతుంటే దుర్మార్గంగా వ్యవహరించడం టీఆర్ఎస్ నిరంకుశ పాలనకు అద్దం పడుతోందన్నారు. వెంటనే వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వీఆర్ఏలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.