కేసీఆర్​.. నీకు చుక్కలు చూపిస్తం

కేసీఆర్​.. నీకు చుక్కలు చూపిస్తం

సర్కారు ఫెయిల్యూర్స్​పై ఇక లడాయే..
బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ వార్నింగ్
బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్

హైదరాబాద్వెలుగు: టీఆర్​ఎస్​ సర్కారు ఫెయిల్యూర్స్​పై మరింత  గట్టిగా పోరాటం చేస్తామని బీజేపీ స్టేట్​చీఫ్ ​బండి సంజయ్​అన్నారు. హైదరాబాద్​లో వచ్చినట్లే వరంగల్​లో వరదలు వచ్చి ఎంతో మంది నష్టపోయారన్నారు. జీహెచ్​ఎంసీలో, గ్రేటర్​ వరంగల్​లో వరద బాధితులందరికీ రూ.10వేల సాయం అందేవరకు ఆందోళనలు చేస్తామన్నారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ ఎంపీలు అర్వింద్ ధర్మపురి, సోయం బాపూరావు, ఇతర నేతలతో కలిసి సంజయ్ మీడియాతో మాట్లాడారు. అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం ప్రతిపక్షాలు నిర్వహించిన భారత్ బంద్ విఫలమైందన్నారు. రాష్ట్రంలో సర్కారే బంద్ నిర్వహించిందని ధ్వజమెత్తారు. బంద్​లో పాల్గొన్న టీఆర్ఎస్ నేతలను రైతులు ఎక్కడికక్కడ నిలదీశారని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో ఆ పార్టీ నేతలను తరిమి కొట్టారని, మరికొన్ని చోట్ల ఆ పార్టీ వారే ఒకరికొకరు తన్నుకున్నారన్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న కేసీఆర్ దీన్ని తట్టుకోలేక.. జనాన్ని ఆ చర్చ నుంచి డైవర్ట్ చేసేందుకే బంద్ కు మద్దతు ఇచ్చారని వివరించారు.

సన్నాలకు క్వింటాకులు రూ. 2,500 చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కు రైతులపై నిజంగానే ప్రేమ ఉంటే ఈ బంద్ లో ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు.  కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇవ్వాలి.. రుణ మాఫీ, పసల్ బీమాపై కేసీఆర్ మాట్లాడాలన్నారు. అగ్రి చట్టాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఇప్పటి వరకు కేసీఆర్ చెప్పలేదన్నారు. రైతులకు మద్దతు ధర వస్తే ఎట్ల వ్యతిరేకిస్తారన్నారు. రైతు తన పంటను ఎక్కువ ధర వచ్చే చోట అమ్ముకునే స్వేచ్ఛను వ్యతిరేకించడమేందని ప్రశ్నించారు. నీ ఫాంహౌజ్ లో పండించే పంటకు మద్దతు ధర నిర్ణయించేది నువ్వా లేక మరొకరా అని ప్రశ్నించారు. రైతులతో సన్న వడ్ల పంటను వేయించి, నువ్వు మాత్రం ఫామ్ హౌజ్ లో దొడ్డు వడ్లను పండించుకున్నావని సీఎం కేసీఆర్ పై సంజయ్ ఫైర్ అయ్యారు. ఈ విషయంలో రైతులకో న్యాయం, నీకో న్యాయమా అని నిలదీశారు. భారత్ బంద్ లో పాల్గొన్న టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలను ముందస్తుగా హౌజ్ అరెస్టు ఎందుకు చేయలేదని పోలీసులను ప్రశ్నించారు. వారికి సహకరించినట్లుగానే ఇక నుంచి మేము చేసే నిరసనలు, ఆందోళనలకు పోలీసులు సహకరించాలని కోరారు.

ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై ఉద్యమిస్తం

టీఎన్జీవో, జర్నలిస్టుల సంఘాల నాయకుల తీరుపై సంజయ్ నిప్పులు చెరిగారు. బంద్ లో  పాల్గొనే ఉద్యోగులకు డ్యూటీ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్ సర్కార్ ను కోరుతూ లెటర్ రాయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘాల నేతలు సీఎం కేసీఆర్ మోచేతి నీళ్లు తాగతున్నారని విమర్శించారు. అసలు వీరికి సీఎం అపాయింట్ మెంట్ ఇస్తున్నారా, ఉద్యోగుల సమస్యలపై సీఎంతో ఒక్కసారైనా చర్చించారా అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై ఈ నాయకులు ఎందుకు చర్చించరన్నారు. ఐఆర్, పీఆర్సీ గురించి ఎందుకు మాట్లాడరన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా బంద్ లో పాల్గొనడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. బీజేపీ కూడా ఉద్యోగుల సమస్యలపై ఆందోళన చేయబోతుందని, టీఎన్జీవో నేతలు మద్దతిస్తారో లేదో చూడాలన్నారు. ఉద్యోగ సంఘాల నేతల అక్రమాస్తుల లెక్కలు తీస్తామని హెచ్చరించారు. వీరిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. వాళ్లను సస్పెండ్ చేయాలని లీగల్ గానే ఫైట్ చేస్తామని చెప్పారు. టీఎన్జీవో ఉద్యోగ సంఘాల నాయకులను ఓటింగ్ ద్వారా మాత్రమే ఎన్నుకోవాలన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి స్థానిక విలేఖరి ఒకరిని ఫోన్ లో బెదిరిస్తే జర్నలిస్టుల సంఘాల నేతలు ఎందుకు స్పందించరన్నారు.

బీజేపీలో  చేరికలు

నిర్మల్ జిల్లాకు చెందిన వివిధ పార్టీల నాయకులు సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఖానాపూర్ నియోజకవర్గం పెంబి మండల జడ్పీటీసీ జానకీ రమేశ్, నిర్మల్ మున్సిపల్ మాజీ చైర్మన్ అప్పాల గణేశ్ తో పాటు పలువురు కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నిర్మల్ జిల్లా ప్రెసిడెంట్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.