తెలంగాణ ప్రజలను తెలివిలేనోళ్లంటవా? .. కేటీఆర్ పై బండి సంజయ్ ఫైర్

తెలంగాణ ప్రజలను తెలివిలేనోళ్లంటవా? ..  కేటీఆర్ పై బండి సంజయ్ ఫైర్

కరీంనగర్, వెలుగు: తెలంగాణ ప్రజలకంటే ఆంధ్రోళ్లు తెలివైన వాళ్లంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్​ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. 'కొట్లాడి రాష్ట్రం సాధించిన తెలంగాణ ప్రజలను తెలివిలేనోళ్లంటావా? అమెరికాలో చిప్పలు కడిగిన నీకు అధికారం అప్పగిస్తే.. తెలివిలేనోళ్లంటావా? సకల జనుల సమ్మె చేసి, ఉద్యోగాలను ఫణంగా పెట్టిన ఉద్యోగులను తెలివిలేనోళ్లంటావా? బలిదానమైన 14 00 మంది నీకు తెలివిలేనోళ్లా?' అంటూ నిప్పులు చెరిగారు. శనివారం కరీంనగర్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో బీఆర్ఎస్ ను ఈడ్చి తన్నాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 'బీఆర్ఎస్ కార్యకర్తలారా.. మీరు నిజంగా తెలంగాణ వాదులైతే, పార్టీ నుంచి బయటకి రండి.. బీఆర్ఎస్ ను భూస్థాపితం చేయండి' అని పిలుపునిచ్చారు. 'ఫోన్ ట్యాపింగ్ వాస్తవం. బాధ్యులైన నేతలను ఎందుకు అరెస్ట్ చేయరు? పట్టుకుని జైల్లో వేసి ఊచలు లెక్కపెట్టించాలి. అంతే తప్ప ఫోన్ ట్యాపింగ్ తో ఒకరు, కాళేశ్వరం  పేరుతో ఇంకొకరు డ్రామాలాడుతూ ప్రజా సమస్యలను దారి మళ్లిస్తున్నరు. ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని తెలంగాణ ప్రజలను కోరుతున్నా' అని సంజయ్​అన్నారు.