
కరీంనగర్ టౌన్, వెలుగు: మోదీ సర్కార్ అందించిన స్మార్ట్ సిటీ నిధులతోనే కరీంనగర్ సిటీ అందంగా తయారైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. శనివారం కరీంనగర్ బల్దియా ఆఫీస్లో ఎంపీ ల్యాడ్స్ నిధులతో కొనుగోలు చేసిన డ్రిల్లింగ్ మెషీన్లను మాజీ మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ప్రయోజనాలు, అభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వం ఎంపీ ల్యాడ్స్ నిధులు కేటాయిస్తుందన్నారు.
గతంలో సిటీలోని ఆదర్శనగర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో వడ్డెర బస్తీ పూర్తిగా కాలిపోయిందని, ఆయా కుటుంబాల జీవనోపాధి కోసం ఎంపీ ల్యాడ్స్ నిధులతో డ్రిల్లింగ్ మెషీన్లను ఇస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం కమాండ్ కంట్రోల్ సిస్టమ్ను సందర్శించారు. కార్యక్రమంలో లీడర్లు, మాజీ కార్పొరేటర్లు డి.శంకర్, సుమ, శిల్ప, జయశ్రీ, ఆనంద్, సతీశ్, రమణారెడ్డి,అధికారులు పాల్గొన్నారు.
హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన
బోయినిపల్లి, వెలుగు, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వెంకట్రావుపల్లి వద్ద శనివారం హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్.. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి శంకుస్థాపన చేశారు. వెంకట్రావుపల్లి నుంచి జగ్గారావుపల్లికి వెళ్లే రోడ్డులో రూ.3.05 కోట్లతో ఈ బ్రిడ్జిని నిర్మించనున్నారు.